పార్టీ మార్పుపై తేల్చేసిన గొట్టిపాటి :టీడీఎల్పీ మీటింగ్ కు వంశీకి ఆహ్వానం: ఆ ఎమ్మెల్యేలు గైర్హాజరు..
ఏపీలో కొద్ది రోజులుగా పార్టీ మారుతారంటూ చర్చకు కారణమైన టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్ తన నిర్ణయం ఏంటో తేల్చి చెప్పేసారు. టీడీపీ నుండి అద్దంకి ఎమ్మెల్యేగా ఉన్న రవి వైసీపీలో చేరుతారంటూ కొద్ది కాలంగా ప్రచారం సాగుతోంది. దీని పైన అసెంబ్లీ లాబీల్లో స్పందించారు. అదే విధంగా టీడీపీకి రాజీనామా చేసి.. వైసీపీతో దగ్గరగా ఉన్న గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అనుకోని విధంగా టీడీఎల్పీ సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానం వచ్చింది. ఇక, తొలి రోజు అసెంబ్లీ సమావేశాని మొత్తం అయిదుగురు టీడీపీ ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. అందులో ముగ్గురు ముందస్తు సమాచారంతోనే రాలేదని తెలుస్తోంది. మిగిలిన ముగ్గురి మీద యధావిదిగా ప్రచారం కొనసాగుతూనే ఉంది. ఇంతకీ.. గొట్టిపాటి రవి..వల్లభనేని వంశీ తేల్చిందేంటి..ఏం చెప్పారు..
అడకత్తెరలో అద్దంకి ఎమ్మెల్యే..... గొట్టిపాటి రవి కుమార్ ని టార్గెట్ చేసిన వైసీపీ !!
గొట్టిపాటి రవి తేల్చి చెప్పేసారు..
2014 ఎన్నికల్లో అద్దంకి నుండి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన గొట్టిపాటి రవి కుమార్ ఆ తరువాత టీడీపీలో చేరారు. రవి టీడీపీలోకి రావటంతో అప్పటి వరకు అక్కడ ఇన్ ఛార్జ్ గా ఉన్న కరణం బలరాం ను కాదని పార్టీ అధినేత చంద్రబాబు రవికే బాధ్యతలు అప్పగించారు. తాజాగా జరిగిన ఎన్నికల్లోనూ టీడీపీ నుండి పోటీ చేసిన రవి గెలుపొందారు. అయితే, కొద్ది రోజుల నుండి వైసీపీ ప్రభుత్వంలోని ఒక మంత్రి నేరుగా రవితో మంతనాలు సాగిస్తున్నారని..వైసీపీలోకి వస్తారని ప్రచారం సాగుతోంది. దీని పైన అసెంబ్లీ లాబీల్లో గొట్టిపాటి రవి స్పందించారు. తాను టీడీపీని వీడేది లేదని తేల్చేసారు. తనకు సంబంధించిన క్వారీల్లో మూడు సార్లు తనిఖీలు జరిగాయాని..గతంలో ఎప్పుడూ లేని విధంగా తనిఖీలు చేస్తున్నారని వివరించారు. అసలు తనిఖీల్లో ఏం చేసారో కూడా కనీస సమాచారం ఇవ్వలేదని వాపోయారు. ఎంత ఒత్తిడి వచ్చినా తాను పార్టీ మార్పు విషయంలో మాత్రం ఆలోచన లేదని తేల్చి చెప్పారు.
టీడీఎల్పీ మీటింగ్ కు వంశీకి ఆహ్వానం..
టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయంలో చివరి వరకు ఎదురు చూసే ధోరణిలో టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే తన భవిష్యత్ వైసీపీతో అని వంశీ ప్రకటించారు. అయితే వంశీని పార్టీ నుండి సస్పెండ్ చేసిన టీడీపీ అధికారికంగా ఆ సమాచారం స్పీకర్ కార్యాలయానికి ఇవ్వలేద. దీంతో..వంశీ అసెంబ్లీ సమావేశాల తొలి రోజు టీడీపీ బెంచ్ లలోనే చివరన కూర్చున్నారు. పార్టీ ఎమ్మెల్యేల తో కాకుండా సింగిల్ గా కూర్చున్నారు. అయితే, అసెంబ్లీ వాయిదా పడిన తరువాత చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేతో సమావేశం నిర్వహించారు. దీనికి రావాల్సిందిగా పార్టీ నుండి వంశీకి ఆహ్వానం వచ్చింది. అయినా..వంశీ మాత్రం తాను ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసానని..సమావేశానికి రాలేనంటూ వంశీ స్పష్టం చేసారు. దీంతో..వంశీని ఆ సమయంలో అక్కడకు చేరుకున్న ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర రెడ్డి తన కార్యాలయంలోకి తీసుకెళ్లారు.
టీడీపీ నుండి 18 మంది హాజరు..
అసెంబ్లీ సమావేశాలకు టీడీపీ నుండి ఎంత మంది హాజరువుతారనే అంశం పైన తొలి నుండి ఆసక్తి నెలకొని ఉంది. మొత్తం 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీకీ ఉండగా..అందులో వంశీ తో సహా మొత్తం 18 మంది ఎమ్మెల్యేలు శాసనసభకు హాజరయ్యారు. ఎమ్మెల్యేలు బాలకృష్ణ, పయ్యావుల, గంటా శ్రీనివాసరావు, బుచ్చయ్య చౌదరి, వాసుపల్లి గణేష్ గైర్హాజరయ్యారు. అయితే, అందులో బాలకృష్ణ, పయ్యావుల, గోరంట్ల బుచ్చయ్య చౌదరి ముందస్తు సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. పయ్యావుల అనారోగ్యం కారణంగా హాజరు కాలేదు. అయితే పార్టీ మారుతారనే ప్రచారం సాగుతున్న సమయంలో ఆ వార్తలను ఖండించిన మాజీ మంత్రి గంటా..ఆయన సహచరుడు వాసుపల్లి గణేష్ గైర్హాజరు పైన మాత్రం జోరుగా ప్రచారం సాగుతోంది.