లోకేశ్ కోసం నా సీటు త్యాగం చేసి భారీ మెజార్టీతో గెలిపించుకుంటా: గొట్టిపాటి
అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ను ఎమ్మెల్యేగా చూసేందుకు తాను రాజీనామా చేస్తానని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ప్రకటించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ లోకేశ్ ను మంత్రివర్గంలోకి తీసుకోవాలంటే ఎమ్మెల్సీ కన్నా ఎమ్మెల్యేగా ఎన్నికై వస్తేనే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
అంతేకాదు లోకేశ్ అద్దంకి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానంటే, తన సీటును త్యాగం చేసి ఆయన్ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటానని తెలిపారు. లోకేశ్ అద్దంకి నుంచి పోటీ చేస్తే అద్దంకితో పాటు ప్రకాశం జిల్లా అంతా అభివృద్ధి పథంలో దూసుకెళుతుందని గొట్టిపాటి రవికుమార్ అన్నారు.
ఇటీవల కాలంలో నారా లోకేశ్ని మంత్రి వర్గంలోకి తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో కూడా టీడీపీకి చెందిన పలువురు నేతలు రాష్ట్ర మంత్రివర్గంలోకి లోకేశ్ను తీసుకోవాలని కోరగా.. మరికొందరు ఏకంగా కేంద్ర కేబినెట్లో లోకేశ్ మరింత మెరుగ్గా రాణిస్తారని మరికొందరు నేతలు చెబుతున్నారు.
ఈ క్రమంలో ఇటు రాష్ట్రంలో, లేదంటే అటు కేంద్రంలో ఎక్కడ లోకేశ్కు చోటు కల్పించినా ఆయన కోసం తమ పదవులకు స్వచ్ఛందంగా రాజీనామా చేస్తామని ప్రకటించారు. మరోవైపు ప్రత్యక్ష రాజకీయాల్లోకి లోకేశ్ ఎంట్రీపై టీడీపీ అధినేత చంద్రబాబు సైతం సుముఖంగానే ఉన్నారు.
బాగా పనిచేస్తున్నాడు: లోకేశ్కు మంత్రి పదవిపై చంద్రబాబు
ఇటీవల ముగిసిన కృష్ణా పుష్కరాల అనంతరం మీడియాతో చంద్రబాబు మాట్లాడుతూ లోకేశ్ ప్రస్తావన తీసుకొచ్చారు. త్వరలో కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ ఉంటుందని, సమయం వచ్చినప్పుడు లోకేశ్కు కేబినెట్లో మంత్రి పదవి కల్పించే విషయమై నిర్ణయం తీసుకుంటామన్నారు. పార్టీ కార్యక్రమాల దృష్ట్యా లోకేశ్ పనితీరు చాలా బాగుందని కితాబిచ్చిన సంగతి తెలిసిందే.