రా చూసుకుందాం: సునీత ఎదుటే కుర్చీలతో రెచ్చిన గొట్టిపాటి-కరణం, బాబు సీరియస్
ప్రకాశం: ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు కరణం బలరాం, గొట్టిపాటి రవి కుమార్ వర్గాల మధ్య మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్వయంగా ఆ ఇద్దరు నేతలు రెచ్చిపోయారు. మంత్రులు శిద్ధా రాఘవ రావు, పరిటాల సునీత, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమక్షంలో ఒకరి పైకి మరొకరు దూసుకు వచ్చారు. సమావేశం ప్రారంభమైన తర్వాత అజెండాలోని అంశాలను చదువుతున్న సమయంలో వాగ్వాదం ప్రారంభమైంది.
టిడిపిలోకి గుర్నాథ్రెడ్డి, చిచ్చు: పక్కన కూడా నిల్చోను, హత్యలు-కబ్జాలు.. ప్రభాకర్ చౌదరి నిప్పులు
మార్కెట్ కమిటీల నియామకం గురించి సమావేశంలో ప్రస్తావించారు. కమిటీ వ్యవహారాన్ని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివ రావు లేవనెత్తారు. ఈ కమిటీ అధ్యక్షుడిని నియమించుకునే అవకాశం తనకు ఇవ్వాలన్నారు. జోక్యం చేసుకున్న కరణం.. ఎక్కడి నుంచో వచ్చిన వారు పెత్తనం చలాయించాలని చూస్తున్నారని, ఆ కమిటీని మీరే వేసుకోండని చెప్పారు. గొట్టిపాటిని ఉద్దేశించి కరణం ఆ వ్యాఖ్యలు చేశారు.
గొట్టిపాటి హెచ్చరిక, కుర్చీ ఎత్తి దూసుకొచ్చిన కరణం
కరణం వ్యాఖ్యలపై వెంటనే గొట్టిపాటి స్పందించారు. మార్టూరు ఏఎంసీ పాలకవర్గ నియామకం ఆగిపోవడంలో తన పాత్ర లేదని, అనవసరంగా తనను ఇరికించాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరికగా మాట్లాడారు. దీంతో కరణం ఆగ్రహంతో ఊగిపోయారు. కరణం బలరాం కుర్చీ ఎత్తి గొట్టిపాటి వైపు దూసుకొచ్చే ప్రయత్నం చేశారు.
రా చూసుకుందాం..
రా చూసుకుందామంటూ గొట్టిపాటి కూడా ముందుకు వచ్చారు. ఆ దశలు ఇరువురు కొట్టుకునే స్థాయికి వెళ్లారు. అరుపులు, కేకలతో ఆ ప్రాంగణం దద్దరిల్లింది. దీంతో సమావేశం రసాభాస అయింది. పరిస్థితి అదుపు తప్పుతుందని భావించిన మంత్రులు, నేతలు వారికి సర్ది చెప్పారు. విషయం తెలిసిన మంత్రి నారాయణ సమావేశ మందిరానికి వచ్చి ఇరు నేతలను శాంతింపజేసి సమావేశాన్ని కొనసాగించారు.
పార్టీ కీలక నాయకులు అంటూ ఆగ్రహం
ఈ సందర్భంగా కరణం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీ కీలక నాయకులు తీరు సక్రమంగా లేదని మండిపడ్డారు. అద్దంకి నియోజకవర్గంలో ప్రతి పథకంలోనూ టిడిపి కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందన్నారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారి కారణంగా చాలా సమస్యలు వస్తున్నాయని గొట్టిపాటిని ఉద్దేశించి అన్నారు. మార్టూరు మార్కెట్ కమిటీ అధ్యక్షుడి నియామకంపై జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు.
ఎవరి అవసరాల కోసం వాళ్లం పార్టీ మారాం
గొట్టిపాటి కూడా తీవ్రంగానే స్పందించారు. ఎవరు పార్టీలోకి కొత్తగా వచ్చారని, మీ కంటే ముందు నుంచే మేం టీడీపీలో ఉన్నామని, తమ రాజకీయం మొదలైంది ఇదే పార్టీలో అని, మీరు పార్టీలు మారలేదా, మధ్యలో ఎవరి అవసరాల కోసం వారు పార్టీలు మారాం, పదే పదే అదే మాటలు ఎందుకు అని మండిపడ్డారు.
సీరియస్గా తీసుకున్న చంద్రబాబు
ఇంకోసారి పార్టీ మారారు అని మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. ఆ తర్వాత ఇరువురు.. రా తేల్చుకుందామంటూ ముందుకు వస్తూ సవాళ్లు విసురుకున్నారు. కాగా ఈ గొడవపై వెంటనే దామచర్ల జనార్దన్, మంత్రి సునీత తదితరులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమాచారం ఇచ్చారు. దీంతో అధిష్ఠానం తీవ్రంగా పరిగణించినట్లుగా తెలుస్తోంది.