తలదించుకునే వెళ్తున్నా, బాబుకు తెలుసు: గొట్టిపాటి, ‘పరిటాల తీసుకెళ్లారు’
తాను తెలుగుదేశం పార్టీలో చేరడాన్ని ఎమ్మెల్సీ కరణం బలరాం, ఆయన ఫ్యామిలీ జీర్ణించుకోలేకపోతోందని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఒంగోలు టీడీపీ జిల్లా అధ్యక్ష ఎన్నికల్లో జరిగిన
ప్రకాశం: తాను తెలుగుదేశం పార్టీలో చేరడాన్ని ఎమ్మెల్సీ కరణం బలరాం, ఆయన ఫ్యామిలీ జీర్ణించుకోలేకపోతోందని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఒంగోలు టీడీపీ జిల్లా అధ్యక్ష ఎన్నికల్లో జరిగిన గొడవపై ఆయన మంగళవారం ఓ మీడియా ఛానల్తో మాట్లాడారు. తాను గొడవ జరగకుండా ఆపానని తెలిపారు.
ఒంగోలులో ఉద్రిక్తత: కరణం, గొట్టిపాటి వర్గాల ఘర్షణ, రవిపై దాడికి యత్నం
వేమవరం హత్యలకు తనకు సంబంధం లేదని గొట్టిపాటి స్పష్టం చేశారు. హత్యలపై విచారన జరపాలని, తనకు సంబంధం ఉందని తేలితే తాను రాజకీయాల నుంచే తప్పుకుంటానని గొట్టిపాటి రవికుమార్ తేల్చి చెప్పారు. జిల్లాలో తరచూ జరుగుతున్న దాడులతో టీడీపీకి నష్టం జరుగుతుందని అన్నారు. తన వైపు నుంచి తప్పు జరగకుండా చూసుకుంటున్నానని తెలిపారు. మిగితాదంతా చంద్రబాబు చూసుకుంటారని చెప్పారు.
తలదించుకునే వెళ్తున్నా..
గత మహానాడు నుంచి తనపై, తన వర్గీయులపై దాడులు జరుగుతూనే ఉన్నాయని రవికుమార్ తెలిపారు. ఎప్పుడు దాడులు జరిగినా తాను తలదించుకునే వెళుతున్నానని గొట్టిపాటి చెప్పారు. పార్టీకి నష్టం కలగకూడదనే ఉద్దేశంతోనే తాను తలదించుకునే వెళుతున్నానని తెలిపారు.
ప్రతీ సందర్భంలోనూ..
తమ కుటుంబంలో మనిషిని పోగొట్టుకున్నామని, అయినా దాడులకు దిగలేదని చెప్పారు. తాము ఫ్యాక్షన్ బాధితులమేనని తెలిపారు. తమ కుటుంబంలో జరిగింది మరో కుటుంబంలో జరగకూడదనే తాము కోరుకుంటున్నామని తెలిపారు. అయినా, కరణం వర్గం మాత్రం తరచూ దాడులకు దిగుతూనే ఉందని అన్నారు. తాను పార్టీలో చేరినప్పటి నుంచి ప్రతీ సందర్భంలోనూ తనను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
చంద్రబాబుకు తెలుసు
సమావేశంలో కరణం వర్గీయులు దాడులకు దిగడంతో తాను మంత్రులకు జిల్లా అధ్యక్ష ఎన్నికలపై తన అభిప్రాయాన్ని చెప్పి అక్కడ్నుంచి వెళ్లిపోయానని గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఇటీవల జరిగిన హత్యలు, ఇక్కడ జరిగిన గొడవలపై తాను టీడీపీ అధినేత చంద్రబాబుకు వివరిస్తానని రవికుమార్ తెలిపారు. దాడులకు ఎవరు పాల్పడుతున్నారో చంద్రబాబుకు తెలుసని అన్నారు.
సర్దుకుపోతున్నాం..
తానెంటో అద్దంకి ప్రజలకు తెలుసని రవికుమార్ అన్నారు. చంద్రబాబును మరోసారి సీఎం చేయాలనే తాను టీడీపీలో చేరినట్లు తెలిపారు. తగవులు పెట్టడం తమకు రాదని చెప్పారు. ఎన్నిసార్లు దాడులు జరిగినా తామే సర్దుకుపోతున్నామని రవికుమార్ తెలిపారు.
పరిటాల పక్కకు తీసుకెళ్లారు..
గొడవ జరుగుతున్న సమయంలో తనను మంత్రి పరిటాల సునీత పక్కకు తీసుకెళ్లారని, ఆ తర్వాత టీడీపీ జిల్లా అధ్యక్ష ఎన్నికలపై అభిప్రాయాన్ని తెలిపి అక్కడ్నుంచి వెళ్లిపోయినట్లు గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఈ సమావేశానికి మంత్రులు పరిటాల సునీత, నారాయణ, సిద్ధా రాఘవరావు హాజరైన విషయం తెలిసిందే. మంత్రుల సమక్షంలోనే ఈ గొడవ జరగడం గమానర్హం.