రాజకీయాలు వదిలేస్తా: గొట్టిపాటి, బాబు ఆరా, నేతలు ఫోన్ చేస్తే కరణం ఇలా..
ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం వేమవరంలో గతరాత్రి జరిగిన జంట హత్యలపై అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ మరోసారి స్పందించారు.
ఒంగోలు: ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం వేమవరంలో గతరాత్రి జరిగిన జంట హత్యలపై అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ మరోసారి స్పందించారు.
తమ కుటుంబానికి ఈ గొడవతో ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. వేమవరంలో గతరాత్రి జరిగిన హత్యలు రాజకీయ హత్యలు కాదని, తాను ఇప్పటికి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానన్నారు.
గొట్టిపాటితో చిచ్చు: చంద్రబాబును టార్గెట్ చేసిన కరణం
గతంలో ఎప్పుడైనా, ఎక్కడైనా హత్యలు చేయించినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. ఫ్యాక్షన్ వలన నష్టపోయిన ఫ్యామిలీ తమది అన్నారు.
ఫ్యాక్షన్ను ప్రోత్సహించే కుటుంబం కాదని, ప్రత్యర్థులు కావాలనే రాజకీయం చేస్తున్నారన్నారు. తనను కావాలనే కొందరు లక్ష్యంగా చేసుకొని ఆరోపణలు చేయడం విడ్డూరమన్నారు.
సంబంధం లేదని గొట్టిపాటి
అంతకుముందు కూడా మాట్లాడుతూ.. తమ కుటుంబం రాజకీయ హత్యలకు గురయిందని, అలాంటి వాటిని ప్రోత్సహించమని, ఫ్యాక్షన్ బాధితులకు అండగా ఉంటామని గొట్టిపాటి అన్నారు.
టిడిపిలోకి వచ్చాక చాలా అవమానాలు ఎదుర్కొన్నామని, కానీ టిడిపి గెలుపు కోసం అన్నీ భరిస్తున్నామన్నారు. హత్యల విషయంలో విచారణ జరిపించాలని, ఏ శిక్షకైనా తాను సిద్ధమన్నారు.
ఇదిలా ఉండగా, శుక్రవారం రాత్రి వేమవరంలో కరణం బలరాం వర్గీయులు హత్యకు గురైన విషయం తెలిసిందే. ఇది టిడిపిలోని గొట్టిపాటి వర్గానికి, కరణం వర్గానికి మధ్య రాజకీయ వాగ్యుద్ధానికి తెరలేపింది.
ఉద్రిక్త పరిస్థితి.. గొట్టిపాటి వర్గీయులుగా ప్రాథమిక నిర్ధారణ
ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శనివారం తెల్లవారేసరికి నియోజకవర్గాన్ని పోలీసులు చుట్టుముట్టారు. ఎస్పీ త్రివిక్రమవర్మతో సహా జిల్లాలోని అందరు డీఎస్పీలు, 13 మంది సీఐలు, ఎస్సైలు, దాదాపు 200 మంది సిబ్బందితో గస్తీ పెట్టారు. అద్దంకి పట్టణంతో పాటు బల్లికురవ మండల కేంద్రం, వేమవరం గ్రామంలోను, ఇతర కొన్ని చోట్ల పోలీసులు పహారా కాశారు. ఈ ఘటనలో మృతిచెందిన ఇద్దరు కరణం వర్గీయులు దీర్ఘకాలంగా తెదేపాలో ఉంటున్నారు.
దాడులకు పాల్పడిన వారు గత ఏడాది వైసిపి నుంచి టిడిపిలోకి వచ్చారు. వీరు ఎమ్మెల్యే గొట్టిపాటి వర్గీయులుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారని తెలుస్తోంది.
పక్కా ప్రణాళికతో దాడి
శుక్రవారం రాత్రి పక్కా ప్రణాళికతోనే దాడి జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. గ్రామంలో ఇరువర్గాల మధ్య చాలా ఏళ్లుగా కక్షలు ఉన్నాయి. దాడులు చేసుకునేందుకు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిందితులుగా గుర్తించిన వారి ఇళ్ల వద్ద ప్రధాన రహదారిపై స్పీడ్ బ్రేకర్లను అనధికారికంగా నిర్మించారు. ప్రత్యర్థులు వాహనాలపై అటుగా వెళ్లేటనప్పుడు వేగం నెమ్మదిస్తుంది. కాబట్టి వెంటనే దాడి చేయొచ్చనేది ప్లాన్.
అనుకున్నట్లే శుక్రవారం రాత్రి ఆరుగురు పెళ్లికి వెళ్లి వస్తున్నారన్న విషయం తెలుసుకుని మాటు వేశారు. ముందుగా లక్ష్మి అనే మహిళ డబ్బాలో కారం పట్టుకుని వారి కళ్లల్లో కొట్టింది. వారు కింద పడిపోవడంతో అప్పటికే సిద్ధం చేసుకున్న కత్తులు, కర్రలతో లక్ష్మి భర్త, కొందరు బంధువులు, ఇతరులు దాదాపు 17 మంది దాడి చేశారు. బైక్లపై వెళ్తున్న వారిని వెంబడించి మళ్లీ వెనక్కు తీసుకువచ్చి విచక్షణ రహితంగా దాడి జరిపినట్లు పోలీసులు గుర్తించారని తెలుస్తోంది.
గాయపడిన వారు ఆసుపత్రికి వెళ్లే అవకాశం కూడా లేకుండా దారిలో కాపు కాశారు. దీంతో ఈ విషయం తెలుసుకుని ఇతర మార్గంలో ఆసుపత్రికి తరలించడంతో దూరం ఎక్కువై బాధితులు మధ్యలోనే మరణించినట్లు తెలుస్తోంది. దాడి అనంతరం గ్రామస్థులు చాలామంది దాడికి పాల్పడిన వారివైపు పరుగున రావడంతో వారు అప్పటికే సిద్ధం చేసుకున్న కారులో పరారయ్యారు.
17 మందిని నిందితులుగా..
ఈ ఘటనలో 17 మందిని నిందితులుగా చేర్చారని తెలుస్తోంది. వారి పేర్లు రాసుకుని, సెల్ఫోన్ నెంబర్ల ఆధారంగా వారి జాడ తెలుసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ముందస్తుగా వారి బంధువులు, సన్నిహితులను పోలీస్స్టేషన్కు తరలించి విచారిస్తున్నారు. ఎస్పీ త్రివిక్రమవర్మ సమక్షంలో బల్లికురవలో నలుగురు అనుమానితులను ప్రశ్నించారు. నిందితులను ఇప్పటికే గుర్తించిన పోలీసులు వారి కోసం బృందాల వారీగా గాలిస్తున్నారు. హైదరాబాద్, విజయవాడ వంటి నగరాలతో పాటు వారు తరచూ గడిపే కొన్ని ప్రదేశాలను గుర్తించారు.
చంద్రబాబు ఆదేశం
పార్టీకి విధేయులుగా ఉన్న వారిపై ఇలా దాడులు జరగడం, ఇద్దరు మృతి చెందడంతో పార్టీ నాయకత్వం ఈ ఘటనపై దృష్టి సారించింది. దీనిపై సమగ్ర విచారణ జరిపి నిందితులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. మరోవైపు టిడిపి సీనియర్ నాయకులు, రాష్ట్ర మంత్రులు అనేక మంది కరణం బలరాంకు ఫోన్ చేసి విషయం తెలుసుకున్నారు. కొత్తగా వచ్చిన వారి నుంచి అనేక సమస్యలు వస్తున్నాయని బలరాం వారికి చెప్పారని తెలుస్తోంది. నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితులను వారికి వివరించారు. శనివారం సాయంత్రం ఆయన బల్లికురవ గ్రామంలోని బాధితుల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబాలను పరామర్శించారు.