బాబుకు 'జగన్ పార్టీ' తలనొప్పి: పింఛన్ కోసం.. మళ్లీ గొట్టిపాటిXకరణం
ఒంగోలు: తెలుగుదేశం పార్టీ నేతలు గొట్టిపాటి రవి కుమార్, కరణం బలరాంల మధ్య బుధవారం నాడు మరోసారి విభేదాలు తలెత్తాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే గొట్టిపాటి కొద్ది రోజుల క్రితం టిడిపిలో చేరిన విషయం తెలిసిందే.
బుధవారం ఉదయం బల్లికురవలోని ఎండీవో కార్యాలయం వద్ద కొత్తగా మంజూరైన లబ్ధిదారులకు అధికారులు పింఛన్లు మంజూరు చేశారు. ఆ సమయంలో మాజీ ఎమ్మెల్యే కరణం, ప్రస్తుత ఎమ్మెల్యే గొట్టిపాటి వర్గీయుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
ఆ సమయంలో ఇరువురు నేతలు కూడా అక్కడే ఉన్నారు. తమ వారికి పింఛన్లు ఇవ్వడం లేదని గొట్టిపాటి వర్గీయులు ఆందోళన చేపట్టారు. ఆ సమయంలో గొట్టిపాటి.. కరణంతో వాగ్వాదానికి దిగారు. గొట్టిపాటి అక్కడి నుంచి ఆగ్రహంతో వెళ్లిపోయారు. అధికారుల తీరును తాను సీఎం దృష్టికి తీసుకు వెళ్తానని హెచ్చరించారు.
రెండు నెలల క్రితం కూడా వీరిద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకున్నది. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమారు.. అద్దంకి సీఐ బేతపూడి ప్రసాద్ను ఆదివారం ఉదయానికి బదిలీ చేయిస్తే.. అదే రోజు సాయంత్రానికే ఆ బదిలీని కరణం బలరాం నిలిపివేయించినట్లుగా వార్తలు వచ్చాయి.
అధికార పార్టీలోని ఇరువర్గాల గొడవ అధిష్టానం వరకు వెళ్లింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు, ఇతర నేతలకు, పాత టిడిపి నేతలకు మధ్య పలు నియోజకవర్గాల్లో పొసగడం లేదు. ఇది చంద్రబాబుకు చిక్కులు తెస్తోందని అంటున్నారు.