ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరో ట్విస్ట్: జగన్ వ్యతిరేకించినా పోటీకి గౌరు వెంకటరెడ్డి రెడీ, ‘మైండ్ గేమేనా?’
అమరావతి: ఇప్పటి వరకు కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల ప్రకటనలో ఉత్కంఠ కొనసాగగా.. ఇప్పుడు మరోసారి అలాంటి పరిస్థితే తలెత్తింది. ఒకరి కోసం ఒకరు వేచిచూసిన వైసీపీ, టీడీపీల్లో.. ఎట్టకేలకు టీడీపీ కేఈ ప్రభాకర్ను తమ పార్టీ ఎమ్మెల్సీగా ప్రకటించిన విషయం తెలిసిందే.
Recommended Video
అయితే, మొదట శివానందను అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలున్నాయని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఆ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు.
అధినేతతో మాట్లాడతా..
కాగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున తాను ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆ పార్టీ నేత గౌరు వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంపై మాట్లాడేందుకు పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలవాలని నిర్ణయించుకున్నారు.
జగన్ వ్యతిరేకించినా పోటీ..
కాగా, ప్రజాసంకల్ప యాత్రలో ఉన్న జగన్.. గాండ్లపెంటకు చేరుకున్నారు. ఈ క్రమంలో గౌరు వెంకటరెడ్డి.. జగన్మోహన్ రెడ్డితో భేటీ అయి తాను ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తానని తెలుపుతానని చెప్పారు. ఒక వేళ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇందుకు అంగీకరించకపోయినా తాను పోటీ చేసి తీరుతానని గౌరువెంకటరెడ్డి చెప్పడం గమనార్హం.
వెంకటరెడ్డికి అదే బలం? మైండేగేమా?
రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వారు తనకు మద్దతుగా నిలుస్తారని గౌరువెంకటరెడ్డి భావిస్తుండటమే ఆయన వ్యాఖ్యలకు కారణంగా తెలుస్తోంది. ఈ ప్రాంతంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువగా ఉండటం గమనార్హం.
అయితే, వైసీపీ.. గౌరు వెంకటరెడ్డి ద్వారా మైండ్ గేమ్ ఆడుతోందా? అనే అనుమానాలు కొందరు టీడీపీ నేతల నుంచి వ్యక్తమవుతున్నాయి.
టీడీపీ నుంచి టీడీపీ కేఈ ప్రభాకర్
కాగా, కర్నూలు స్థానిక సంస్థల ఎన్నికల బరి నుంచి వైయస్సార్ కాంగ్రెస్ చివరి నిమిషంలో తప్పుకుంది. వైసీపీ నుంచి గౌరు వెంకట రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డిలతో పాటు నాగిరెడ్డి, రవికిశోర్ రెడ్డి పేర్లు వినిపించాయి. కానీ, టీడీపీ నుంచి శివానంద రెడ్డి పేరు రావడంతో వైసీపీ బరి నుంచి తప్పుకుందని చెబుతున్నారు. అందుకు వైసీపీ నేతతో ఆయనకు బంధుత్వమే కారణమని అంటున్నారు.
వ్యూహాత్మకంగా టీడీపీ.. చివరికిలా..
అయితే, ఆ తర్వాత టీడీపీ నుంచి కేఈ ప్రభాకర్ పేరును ఖరారు చేశారు. కేఈ కూడా మొదటి నుంచి రేసులో ఉన్నారు. వైసీపీకి చెక్ పెట్టేందుకు శివానంద పేరును టీడీపీ కావాలనే వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. వైసీపీ పోటీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించినప్పటికీ.. ఆ పార్టీ నేత గౌరు వెంకటరెడ్డి తప్పకుండా పోటీ చేస్తానని చెబుతుండటంతో ఏకగ్రీవమవుతుందనుకున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరోసారి ఉత్కంఠకు దారితీసింది.