గౌతమి మృతి మిస్టరీ: పెళ్లి ఓ సంచలనం, కారు అటుగా ఎందుకు...
శ్రీగౌతమి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమెను హత్య చేశారనే ఆరోపణలు వెల్లువెత్తడం తీవ్ర వివాదానికి దారి తీసింది.
ఏలూరు: గౌతమి మృతి కేసు మిస్టరీగానే మారింది. నరసాపురం- పాలకొల్లు రహదారిపై దిగమర్రు వద్ద జరిగిన ఘటనలో నరసాపురానికి చెందిన శ్రీగౌతమి మృతి చెందగా ఆమె సోదరి పావని గాయాలతో బయటపడిన విషయం తెలిసిందే. మొదట దాన్ని ప్రమాదంగా భావించినా తర్వాత ఈవ్ టీజింగ్ అని, ఆ తర్వాత పథకం ప్రకారం హత్య చేశారని ఆరోపణలు వచ్చాయి.
గౌతమి కేసులో సోదరి పావని సంచలన ఆరోపణలు, రాజకీయ ఒత్తిళ్లు లేవని..
ఈ కేసును విచారిస్తున్న పోలీసు అధికారులు చెబుతున్న వివరాలకు, ప్రమాదం నుంచి గాయాలతో బయటపడిన పావని చెబుతున్న వివరాలకు మధ్య పొంతన కుదరడం లేదు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్, యాజమానిని అదుపులోకి తీసుకుని విచారించినట్లు కేసు విచారణాధికారి తెలిపారు.
విశాఖపట్నంలో కారు కొనుగోలు చేసి విజయవాడ గుడిలో పూజ చేయించేందుకు వెళుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే, కారు నరసాపురం వైపు ఎందుకు వచ్చిందనే ప్రశ్న ఉదయిస్తోంది. కారులో నిందితులకు సంబంధించిన లగేజీ ఏదీ లేదు. మామూలుగా ఆయితే దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఎవరైనా కొద్దిపాటి లగేజీనైనా పెట్టుకుంటారు.
ఘటనలో మృతి చెందిన గౌతమి విశాఖలో సివిల్స్ పరీక్షలకు శిక్షణ తీసుకుంటుంది. మృతురాలి సోదరి పావని చెప్పిన వివరాల ప్రకారం నిందితుల బంధువులు కూడా విశాఖపట్నంలోనే ఉన్నారు. కొత్త కారు కొనడం, పూజ పేరుతో విజయవాడ వెళ్లి అటునుంచి నరసాపురం రోడ్డులో రావడం మిస్టరీగా మారింది.
గౌతమి మృతి చెందిన తరువాత వెలుగుచూసిన వివాహం సంచలనంగా మారింది. ఏడాది క్రితమే గౌతమికి మండలంలోని ధర్భరేవు గ్రామానికి చెందిన సజ్జా బుజ్జితో వివాహమైనట్లు తెలియడంతో కేసు కొత్త మలుపు తిరిగింది. మృతురాలి సోదరి ఆరోపణల కోణంలో పోలీసులు దర్యాప్తు చేయలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కనీసం సెల్ఫోన కాల్లిస్ట్ ఆధారంగా దర్యాప్తు చేసినా కేసు మిస్టరీ చాలా వరకు వీడేదనే మాట వినిపిస్తోంది.