ప్రభుత్వ వైద్యులు .. ప్రైవేట్ ప్రాక్టీసులా.. ఉక్కుపాదం మోపే యోచనలో జగన్ సర్కార్
ఏపీ సర్కార్ వైద్య శాఖ ప్రక్షాళనకు నడుం బిగించింది. ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్ పై కొరడా ఝుళిపించటానికి రంగం సిద్ధం చేస్తుంది. సుజాతా రావు కమిటీ సూచనల మేరకు జగన్ సామాన్యులకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందించే ప్రణాళికకు శ్రీకారం చుట్టనున్నారు.
ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్ కు చెక్
ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులు నిర్వర్తించే వైద్యులు, బయట ప్రైవేటు క్లినిక్లు నిర్వహించడం అందరికీ తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా ప్రాక్టీస్ చాలా ఎక్కువ. ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధి నిర్వహణను మమ అనిపించి ప్రైవేట్ ఆస్పత్రుల పై దృష్టి పెట్టే డాక్టర్లు తెలుగు రాష్ట్రాల్లో కుప్పలుతెప్పలుగా ఉన్నారు. అంతేనా ప్రభుత్వం వైద్యశాలలకు వచ్చే రోగులను బయట ఉన్న తమ క్లినిక్ లకు రావాల్సిందిగా చెప్పేవారు ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో విధి నిర్వహణ పట్ల శ్రద్ధ వహించకుండా, తమ ప్రైవేటు క్లినిక్ల అభివృద్ధి కోసం నానా తంటాలు పడే వైద్యులు ఎందరో ఉన్నారు. ఇక అలాంటి వారందరికీ చెక్ పెట్టాలని నిర్ణయం తీసుకోనుంది ఏపీ సర్కార్.
వైద్య శాఖ ప్రక్షాళనకు సూచనలు చేసిన సుజాతారావు కమిటీ
ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందేలా వైద్యశాఖ ప్రక్షాళనకు నడుం బిగించింది ఏపీ సర్కార్. ప్రభుత్వాసుపత్రుల్లో విధులు నిర్వర్తిస్తున్న వైద్యుల ప్రైవేటు ప్రాక్టీస్ ను నిషేధించాలని సుజాత రావు సంస్కరణల కమిటీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి సూచించింది. ప్రైవేట్ ప్రాక్టీస్ ని ఆపగలిగితే నే ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సేవలు మెరుగవుతాయని స్పష్టం చేసింది. దీనిపై స్పందించిన సీఎం ప్రైవేటు ప్రాక్టీస్ ను నిషేధించాలనే ఆలోచనలో ఉన్నారు .
100 సూచనలతో నివేదిక ఇచ్చిన సుజాతారావు కమిటీ
ఇక అందుకోసం ప్రైవేటు ప్రాక్టీసు ను నిషేధించడం తో పాటు, ప్రభుత్వ వైద్యుల జీతాలు పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆరోగ్య శాఖలో సంస్కరణల కోసం ప్రభుత్వం నియమించిన సుజాతారావు కమిటీ ఆరోగ్య శాఖలో మెరుగైన మార్పుల కోసం, ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందడం కోసం సుమారు 100 సూచనలతో బుధవారం సీఎంకు నివేదిక అందించింది. నివేదికలోని అంశాలపై కమిటీ చైర్పర్సన్ సుజాతారావు సుమారు రెండు గంటలు సీఎంకు పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
సీఎం జగన్ సానుకూల స్పందన .. ప్రతిపాదనలు సిద్ధం చెయ్యాలని ఆదేశం
సుజాత రావు కమిటీ సూచనలను స్వీకరించిన సీఎం జగన్మోహన్ రెడ్డి వైద్యశాఖ ప్రక్షాళనకు నడుంబిగించారు. సామాన్య ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులకు రావాలంటే భయపడే పరిస్థితి నుండి బయటకు రావాలని ఆకాంక్షిస్తున్న ఆయన ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వసతులు కల్పనకు శ్రీకారం చుట్టాలని అధికారులను ఆదేశించారు. చికిత్స తర్వాత రోగి కుటుంబ పోషణకు 5000 ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నారు. అంతేకాదు మహిళల కోసం మరో 30 500 పడకల ఆసుపత్రులు నిర్మించాలని , అదేవిధంగా రూరల్ సర్వీసు నిబంధన అమల్లోకి తీసుకురావాలని యోచిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.