సుప్రీం తీర్పుతో ఎన్నికలపై యూటర్న్ తీసుకున్న ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ .. అలా అనలేదట !!
ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని, ఎన్నికలు యధావిధిగా కొనసాగించవచ్చని ఆంధ్ర ప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు నిచ్చి అటు జగన్ సర్కార్ కు, ఉద్యోగ సంఘాల నేతలకు పెద్ద షాక్ ఇచ్చింది. రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో పనిచేయాలని సుప్రీంకోర్టు సూచించింది. ఉద్యోగుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి యు టర్న్ తీసుకున్నారు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు .
Recommended Video
జగన్ రెడ్డి శిష్యుడు కాకర్ల ఎవర్ని చంపుతారు ? ఉద్యోగుల సంఘం అధ్యక్షుడి వ్యాఖ్యలపై టీడీపీ ఫైర్
తామెప్పుడూ పంచాయతీ ఎన్నికల్లో పాల్గొనబోమని ప్రకటించలేదన్న వెంకట్రామిరెడ్డి
తామెప్పుడూ పంచాయతీ ఎన్నికల్లో పాల్గొనబోమని ప్రకటించలేదని, ఎన్నికల విధులకు హాజరు కామని చెప్పలేదని ఆయన తెలిపారు. శనివారం ఎన్నికల నిర్వహణపై ఘాటుగా మాట్లాడిన ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ప్రస్తుతం అందుకు భిన్నంగా మాటమార్చారు. ఆరోగ్యం సరిగా లేని ఉద్యోగులను మినహాయించి మిగతా వారితో ఎన్నికలు నిర్వహించుకోవచ్చని సూచించామని సుప్రీం తీర్పు తర్వాత మాటమార్చిన వెంకట్రామిరెడ్డి మళ్లీ ప్రకటన చేశారు.
వయోభారంతో అనేకమంది కరోనాకు భయపడుతున్నారని చెప్పాం.. స్వరం మార్చిన ఉద్యోగుల సంఘం చైర్మన్
వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఉద్యోగులంతా ఎన్నికల విధుల్లో పాల్గొనే అవకాశం ఉంటుందని తాను మాట్లాడానని, తాము విధులు నిర్వర్తించేది లేదని చెప్పలేదని వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ పూర్తయ్యేవరకు గోవాలో స్థానిక ఎన్నికలను వాయిదా వేశారని ఇక్కడ కూడా అలాగే వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వయోభారంతో అనేకమంది కరోనాకు భయపడుతున్నారని అందుకే రాష్ట్ర ఎన్నికల కమిషన్ మరోమారు నిర్ణయంపై పునరాలోచించాలని చెప్పామని వెంకట్రామి రెడ్డి పేర్కొన్నారు.ఎన్నికలను బహిష్కరించాలని, ఎన్నికలలో పాల్గొనబోమని తాము అసలు చెప్పలేదని స్వరం మార్చారు.
సుప్రీం తీర్పుతో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమీషనర్ కీలక నిర్ణయాలు
మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి. ఎన్నికలు నిర్వహించి తీరాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్, ఎలాగైనా అడ్డుకుని తీరాలని జగన్ సర్కార్ చేసిన ప్రయత్నంలో ఫైనల్ గా ఎన్నికల సంఘం మాట నెగ్గించుకుంది. సుప్రీంకోర్టులో సైతం ఎన్నికల సంఘానికి అనుకూలంగా తీర్పు రావడంతో ఏపీలో ఎన్నికల ప్రక్రియకు శరవేగంగా పావులు కదుపుతున్నారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. అందులో భాగంగా ఎన్నికల నిర్వహణపై అధికారులతో ఈరోజు సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్న రమేష్ కుమార్ పకడ్బందీగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించే లక్ష్యంతో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.