దసరాకి ఆర్టీసీ బస్సులు నడపకపోవడం ప్రభుత్వ వైఫల్యం.!ప్రజా సమస్యల పట్ల ఏపి సర్కార్ కు జనసేన సూచన.!
అమరావతి/హైదరాబాద్ : ప్రజా రవాణా వ్యవస్థపై జనసేన పార్టీ స్పందించింది. దసరా, దీపావళి వంటి పవిత్రమైన పండుగలను జరుపుకోవడానికి ప్రజలు పెద్దఎత్తున స్వస్థలాలకు చేరకుంటారని, అలాంటి ప్రజానికానికి రవాణా సౌకర్యం కల్పించడంలో ఏపి ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అసంతృప్తిని వ్యక్తం చేసారు. రవాణా రంగంలో సానుకూలంగా ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని తీసుకోవడంతో ఏపి ప్రభుత్వం విఫలమైందని జనసేన అభిప్రాయపడింది. ఇప్పటికైనా ప్రజాభీష్టం మేరకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది జనసేన.
స్తంభించిన తెలుగు రాష్ట్రాల రవాణా వ్యవస్త.. అనుకూల నిర్ణయం తీసుకోవాలన్న జనసేన..
అంతే కాకుండా తెలంగాణ ప్రాంతం నుంచి, ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఆంధ్ర ప్రదేశ్ కు వెళ్లాలనుకొనే ప్రయాణికులకు ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, కనీసం దసరా నాటికైనా బస్సులు తిరిగితే సొంత ఊళ్ళకు రావాలనుకొన్నవారికి ప్రభుత్వం ఊరట కలిగించినట్టవుతుందని జనసేన అభిప్రాయపడింది. కాగా ఇరు రాష్ట్రాల మద్య కొనసాగుతున్న ప్రతిష్టంభన పట్ల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారని జనసేన భావిస్తోంది. ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణి ప్రజలకు నిరాశ కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తోంది జనసేన పార్టీ.
స్వస్థలాలకు రాలేక ఇబ్బందులుపడుతున్న జనం.. రెండు ప్రభుత్వాలు విఫలం చెందాయన్న పవన్..
అదే విధంగా వైద్యం కోసం హైదరాబాద్ వెళ్ళాలి అనుకొన్నవారికి రవాణా సదుపాయం లేకుండాపోయిందని, తమకు కావల్సినవారికి అత్యవసరమైతే ప్రత్యేక హెలికాప్టర్ ఏర్పాటు చేసి హైదరాబాద్ తరలించే ప్రభుత్వం, పేదల కోసం బస్సులు నడపలేకపోతోందని జనసేన ఆందోళన వ్యక్తం చేసింది. రెండు రాష్ట్రాల మధ్య బస్సులు తిరగకపోవడం వల్ల ఎదురవుతున్న సమస్యలను పలువురు పార్టీ దృష్టికి తీసుకువచ్చారు. ఆర్టీసీ బస్సుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రభుత్వాలు విడనాడాలని జనసేన విజ్ఞప్తి చేస్తోంది.
పండలప్పుడు కీలక పాత్ర పోషించే రవాణా వ్యవస్థ.. ప్రభుత్వాలు పంతాలు వీడాలన్న జనసేన..
అంతే కాకుండా లాక్డౌన్ ముందు రోజు వరకూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య దాదాపు 13వందల బస్సులు నడిచేవని, ఇప్పుడు ఒక్క బస్సు కూడా తిరగటం లేదని లెక్కలు చెప్తోంది జనసేన. అదే విధంగా రైల్వే సేవలూ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదని, ఇలాంటి సమయంలోనే ప్రజలకు బస్సులు అందుబాటులో ఉంచితే ప్రయోజనకరంగా ఉంటుందనే అభిప్రాయాన్ని జనసేన వ్యక్తం చేస్తోంది. కిలోమీటర్ల లెక్కలు, భూభాగాల్లో తిరిగే వైశాల్యాలు తేల లేదు కాబట్టి బస్సులు నడపలేమనేది సంతృప్తికరమైన సమాధానం కాదని జనసేన రెండు ప్రభుత్వాలను నిలదీస్తోంది.
తొందరగా నిర్ణయం తీసుకోవాలి.. ప్రయివేట్ రవాణా వ్యవస్థ అడ్డగోలుగా ధరలు పెంచిందన్న సేనాని..
దసరా పండగ సమయంలోనైనా ఊరు వెళ్ళాలనుకొనే వారు ప్రైవేట్ ట్రావెల్ బస్సుల్లో టికెట్ ధరలకు భయపడుతున్నారని, టికెట్ ధరలు భారంగా ఉంటున్నాయని, వాటిని నియంత్రించే యంత్రాంగం కూడా లేకపోవడం దురదృష్టకరమని జనసేన అభిప్రాయపడింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ అంశంపై తక్షణమే ప్రత్యేక దృష్టి సారించి, సరైన నిర్ణయం తీసుకోకపోతే వచ్చే సంక్రాంతికి కూడా సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉండదని జనసేన ఆవేదన వ్యక్తం చేసింది. ప్రజల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకొని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు భేషజాలకు పోకుండా సానుకూలంగా సమస్యను సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తోంది జనసేన పార్టీ.