ఆన్లైన్ మీడియాను...రెగ్యులేట్ చేసేందుకు కమిటీ
న్యూఢిల్లీ :నకిలీ వార్తలు కట్టడి చేసేందుకు అని ప్రత్యేక ఆదేశాలు జారీ చేసి మళ్లీ వెనక్కి తీసుకున్న కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఇప్పుడు ఆన్ లైన్ పై దృష్టి సారించింది. పుట్టగొడుగుల్లా పుట్టుకు వస్తున్నఆన్లైన్ మీడియా, న్యూస్ పోర్టల్స్ ను క్రమబద్దీకరించేందుకు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఒక కమిటీ ని ఏర్పాటు చేసింది.
ఈ కమిటీ అన్ని రకాల ఆన్ లైన్ మీడియా, న్యూస్ పోర్టళ్లకే కాకుండా వినోద పోర్టళ్లను కూడా రెగ్యులరైజ్ చేసేందుకు తగిన పాలసీని ప్రభుత్వానికి సిఫార్సు చేయనుంది. ఈ కమిటీకి సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సెక్రటరీ...కన్వీనర్గా ఉంటారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు నకిలీ వార్తలపై మార్గదర్శకాలను ఉపసంహరించుకున్న తరువాత మంత్రిత్వ శాఖ మళ్లీ వెంటనే ఈ కమిటీని ఏర్పాటు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ కమిటీపై మేజర్ ఆన్ లైన్ న్యూస్ పోర్టళ్లు స్వాగతిస్తున్నాయి.
ఇప్పటి వరకు టెలివిజన్ ఛానళ్ళలో ప్రసారం చేయబడిన కార్యక్రమాలు కేబుల్ టెలివిజన్ నెట్ వర్క్ రూల్స్, 1994 క్రింద ప్రోగ్రామ్ మరియు ప్రకటన కోడ్ల ద్వారా నియంత్రించబడుతున్నాయి. అదేవిధంగా, ప్రింట్ మీడియాను స్వయం ప్రతిపత్తి గల ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నియంత్రిస్తోంది. అయితే ఈ కొత్త కమిటీ ఏ విధమైన మార్గ దర్శకాల ద్వారా ఆన్ లైన్ మీడియాను క్రమబద్దీకరించనున్నాయనేది ఆసక్తికరంగా మారింది.