ఆ 9 మంది మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి, జగన్పై చంద్రబాబు, పవన్ చిందులు..
ప్రకాశం జిల్లా కురిచేడులో శానిటైర్ తాగి తొమ్మిది మంది చనిపోయిన ఘటన కలచివేస్తోంది. మత్తు కోసం నాటు సారా, శానిటైజర్ కలిపి తాగినట్టు తెలుస్తోంది. కురిచేడులో మొత్తం 20 మంది శానిటైజర్ తాగగా వారిలో తొమ్మిది మంది చనిపోయారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 10 మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఘటనపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ దిగ్బాంతి వ్యక్తం చేశారు.
మద్యం నిషేధిస్తామని ఇచ్చిన సీఎం జగన్ ఏమైపోయిందని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. రాష్ట్రంలో సారా ఏరులైపారుతోందని.. ప్రభుత్వం మాత్రం కళ్లు మూసుకొని ఉందని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కురిచేడు ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. దీంతో నిజనిజాలు వెలికిచూసే అవకాశం ఉందన్నారు.
కురిచేడులో మరణించిన వారు పేద కుటుంబాలకు చెందినవారని గుర్తుచేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తగిన సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. మద్యం దుకాణాలను తెరిచి ఉంచే సమయం మరో గంట పొడిగించడం చూస్తుంటే ప్రభుత్వానికి మద్యనిషేధంపై ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతోందన్నారు పవన్ కల్యాణ్. దీంతో మద్యానికి బానిసలైన వాళ్లు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు.
కురిచేడు ఘటనపై ప్రతపక్ష నేత చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. రాష్ట్రంలో మద్యం ధరలను భారీగా పెంచారని గుర్తుచేశారు. దీంతో సారా, కల్తీ మద్యం, శానిటైజర్లు తాగి.. మద్యానికి అలవాటైన వారు ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. ప్రకాశం జిల్లాలో వైసీపీ మద్యం మాఫియా ఆగడాలు పెరిగిపోయాయని విమర్శించారు.
Recommended Video
వీరే కాక.. ఆ ప్రాంతంలో మరికొందరు గత 10 రోజులుగా శానిటైజర్ తాగుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయాన్ని స్థానిక ఎస్పీ సిద్ధార్థ కౌశల్ వెల్లడించారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో విక్రయిస్తోన్న శానిటైజర్లను సీజ్ చేసి పరీక్షలకు పంపిస్తామని చెప్పారు.