ఆర్టీసీ కాదిక పీటీడీ: కీలక దశకు చేరుకున్న విలీనం..కార్మికుల జీతబత్యాలపై తుది నిర్ణయం
అమరావతి: ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ప్రభుత్వంలో విలీనమైన తరువాత ఆర్టీసీ ఉన్నతస్థాయి ఉద్యోగులు, కార్మికుల వేతనాలు ఎలా ఉండాలి? ఏ స్థాయిలో వారి వేతనాలను పెంచాలి? దీనికి అవసరమయ్యే బడ్జెట్ ఎంత? అనే అంశాలపై అధ్యయనం చేయనుంది. దీనికోసం ప్రత్యేకంగా ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్టీసీ అనే పేరు మార్చి.. దాన్ని ప్రజా రవాణా శాఖ (పీటీడీ)గా మారుస్తామని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన మరో జీవో త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.
తాజాగా ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీకి రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఛైర్మన్ గా వ్యవహరిస్తారు. ఆర్థికం, సాధారణ పరిపాలన, (సర్వీసులు), పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్, న్యాయ శాఖల ముఖ్య కార్యదర్శులను ఈ కమిటీలో సభ్యులుగా నియమించారు. ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (పరిపాలన) సభ్య సమన్వయకునిగా ఉంటారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనమైన తరువాత దాన్ని ప్రజా రవాణా శాఖ (పీటీడీ)గా ఎలా రూపొందించాలనే అంశంపై ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది. విలీనం చేసే విధానం (మెథడాలజీ) ఎలా ఉండాలనేది నిర్దారిస్తుంది.
ఆర్టీసీలో పనిచేస్తోన్న కాంగ్రాక్టు ఉద్యోగులతో సహా అన్ని స్థాయిల్లోని ఉన్నతాధికారులు, ఉద్యోగులు, డిపో స్థాయి కార్మికులకు ప్రస్తుతం అందుతున్న వేతనాలు ఎంత? విలీనం తరువాత ప్రభుత్వంలో వారికి కల్పించాల్సిన జీతాలు ఎంత మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది? వేతన స్వరూపం (పే ఫిక్సేషన్) ఎలా ఉండాలి? వంటి అంశాలను ఈ కమిటీ పరిశీలిస్తుంది. దీనికోసం ఆర్టీసీ ఉద్యోగ, కార్మిక సంఘాల నాయకులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆర్టీసీలో అమల్లో ఉన్న విధి విధానాలు, మార్గదర్శకాలు, సర్వీస్ కండీషన్లపైనా అధ్యయనం చేయనుంది.
ప్రభుత్వంలో విలీనమైన తరువాత వాటిని యథాతథంగా కొనసాగించాలా? వద్దా? అనే విషయంపై నిపుణుల కమిటీ ప్రభుత్వానికి కొన్ని సిఫారసులను అందజేస్తుంది. నిపుణుల కమిటీ తన తుది నివేదికను నవంబర్ 30వ తేదీ నాటికి ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంటుంది. ఈలోగా జీవోలో పొందుపరిచిన అంశాలవారీగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. దీన్నే తుది నివేదికగా ప్రభుత్వం భావించే అవకాశాలు లేకపోలేదు. ఆర్టీసీ ఉద్యోగుల, కార్మిక సంఘాల నుంచి అందిన అభ్యంతరాలను ఆధారంగా చేసుకుని తుది నివేదికలో మార్పులు చేర్పులు చేయొచ్చని అంటున్నారు.