యువత కోసం.. నంబర్ 37: ఏపీలో కొత్త శాఖ ఆవిర్భావం: త్వరలో పోర్ట్ ఫోలియోగా..!
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వంలో కొత్తగా ఓ శాఖ ఆవిర్భవించింది. ఇప్పటిదాకా 36 శాఖలు, వివిధ విభాగాలకు అదనంగా దీన్ని ఏర్పాటు చేశారు. అదే- నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ. త్వరలోనే దీన్ని మంత్రిత్వ శాఖగా మార్చనున్నారు. మంత్రివర్గంలోకి దీన్ని తీసుకోనున్నారు. 37వ శాఖగా నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ఏర్పాటైంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్రంలో ఇప్పటికే స్థాపించిన, ఏర్పాటు కాబోయే పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు కేటాయిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. భారీ పరిశ్రమలు మొదలుకుని, మధ్య, చిన్న తరహా కర్మాగారాల్లో స్థానిక యువతకు 75 శాతం రిజర్వేషన్లు అమలువుతున్నాయా? లేవా? అనే అంశాన్ని పర్యవేక్షించడంతో పాటు..నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన కార్యకలాపాలను పరిశీలించడం ఈ శాఖను ఏర్పాటు చేయడం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం.
ఇదివరకే ఏర్పాటు చేసిన నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, ఆవిష్కరణల విభాగాన్ని కొత్త శాఖలో విలీనం చేస్తున్నట్టు ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అన్ని శాఖల్లాగే.. దీనికి కూడా ఐఎఎస్ అధికారిని ముఖ్య కార్యదర్శిగా నియమిస్తారు. అదనపు కార్యదర్శి, సెక్షన్ ఆఫీసర్లు.. ఇలా అన్ని స్థాయిల్లో ఉద్యోగులు, ఇతర సిబ్బందిని ఈ శాఖకు కేటాయిస్తారు. దీనికి సంబంధించిన పూర్తిస్థాయి విధి, విధానాలపై ప్రస్తుతం కసరత్తు కొనసాగుతోంది. దీనికి తుదిరూపు వచ్చిన వెంటనే పోర్ట్ ఫోలియోగా మార్చుతారు.
కార్మిక, ఉపాధి కల్పన మంత్రి గుమ్మలూరి జయరాం ఈ మంత్రిత్వ శాఖ బాధ్యతలను అప్పగించే అవకాశం ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. లేదా కొత్తగా మరో మంత్రిని కేబినెట్ లోకి తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం పరిశ్రమల్లో స్థానిక యువతకు 75 శాతం రిజర్వేషన్లను కేటాయించే అంశాన్ని కార్మిక మంత్రిత్వ శాఖే పర్యవేక్షిస్తోంది. ఈ నేపథ్యంలో- ఆ మంత్రికే అదనంగా ఈ శాఖను కూడా అప్పగించవచ్చని చెబుతున్నారు.