ఇష్టానుసారంగా ఫీజులు చెల్లవిక: ఉన్నత విద్యా కమిషన్ ఏర్పాటు: ఛైర్మన్ గా హైకోర్టు మాజీ న్యాయమూర్తి
అమరావతి: రాష్ట్రంలో ఉన్నత విద్యారంగంలో ఉన్న అన్ని ప్రైవేటు విద్యాసంస్థల దూకుడుకు కల్లెం పడబోతోంది. ఇష్టానుసారంగా ఫీజులను వసూలు చేస్తూ మధ్య తరగతి కుటుంబాలకు ఉన్నత విద్యను దూరం చేస్తోన్న ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిఘా వేసింది. ఫీజుల నియంత్రణ, విద్యాసంస్థలు, కళాశాలల్లో నాణ్యతా ప్రమాణాల పెంపు, మౌలిక సదుపాయాల కల్పన.. వంటి అంశాలను పర్యవేక్షించడానికి ప్రభుత్వం ఉన్నత విద్యా క్రమబద్దీకరణ, పర్యవేక్షణ కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ చట్టబద్ధత తీసుకొచ్చింది. సివిల్ న్యాయస్థానానికి ఉండే అధికారాలను కల్పించింది. ఉమ్మడి హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వీ ఈశ్వరయ్యను ఛైర్మన్ గా నియమించింది ప్రభుత్వం. ఈ మేరకు ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ గురువారం ఉత్తర్వలు జారీ చేశారు.
ఐఏఎస్ అధికారి, ఇద్దరు ప్రొఫెసర్లు, ఉన్నత విద్యాసంస్థల సంఘాల తరఫున ఓ ప్రతినిధి సభ్యులుగా ఉంటారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి వ్యక్తి ఈ కమిషన్కు సీఈవోగా వ్యవహరిస్తారు. రాష్ట్రంలోని అన్ని ఉన్నత విద్యా సంస్థల్లో ఫీజులను ఏ స్థాయిలో వసూలు చేస్తున్నారనే విషయం తెలిసిందే. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి వస్తోన్న డిమాండ్ కు అనుగుణంగా ఏడాదికేడాది ఫీజులను పెంచుకుంటూ పోతున్నారు ఆయా కళాశాలల యాజమాన్యాలు. ఏ ప్రాతిపదికన వారు ఫీజులను పెంచుతున్నారనే విషయం ఓ పట్టాన అర్థం కాదు. అయినప్పటికీ..తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులు.. అడిగినంత మేర ఫీజులను చెల్లిస్తున్నారు.
ఈ పరిస్థితిని నియంత్రించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాము అధికారంలోకి వస్తే.. ఉన్నత విద్యాసంస్థల్లో ఫీజులను నియంత్రిస్తామంటూ ప్రతిపక్ష నేత హోదాలో చేపట్టిన పాదయాత్ర సందర్భంగా వైఎస్ జగన్ హామీ సైతం ఇచ్చారు. ఈ దిశగా కార్యాచరణ మొదలు పెట్టారు. రాష్ట్రంలో ప్రైవేటు రంగంలో ఉన్న జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, ఎంబీఏ, డీమ్డ్ యూనివర్సిటీలను ఈ కమిషన్ పరిధిలోకి తీసుకొచ్చారు. ప్రతి మూడునెలలకోసారి ఈ కమిషన్.. ఆయా కళాశాలల పనితీరు, మౌలిక సదుపాయాల కల్పనపై ఆరా తీస్తుంది. తాము రూపొందించిన ప్రమాణాలు, నిబంధనలకు విరుద్ధంగా ఉండే కళాశాలల గుర్తింపు రద్దు చేయడం లేదా భారీ జరిమానాలను విధించే అధికారాన్ని ఈ కమిషన్ కు కల్పించారు.