రాష్ట్ర కొత్త అడ్వకేట్ జనరల్ ఎవరో తెలుసా?: కోడె దుర్గా ప్రసాద్ రాజీనామా ఆమోదం!
అమరావతి: రాష్ట్రానికి కొత్త అడ్వకేట్ జనరల్ నియమితులయ్యారు. ప్రముఖ న్యాయవాది సుబ్రహ్మణ్యం శ్రీరామ్ను అడ్వకేట్ జనరల్గా నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటిదాకా- ఈ పదవిలో కొనసాగిన దమ్మాలపాటి శ్రీధర్ కొద్దిరోజుల కిందటే తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఆయన రాజీనామాను ఆమోదించింది.
దమ్మాలపాటి శ్రీధర్ రాజీనామాను ఆమోదిస్తూ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. ఆ కాస్సేపటికే సుబ్రహ్మణ్యం శ్రీరామ్ను అడ్వకేట్ జనరల్గా నియమిస్తూ వేరే ఉత్తర్వులను ఇచ్చారు. సుబ్రహ్మణ్యం శ్రీరామ్ బాధ్యతలను స్వీకరించినప్పటి నుంచీ ఆయన నియామకం అమల్లోకి వస్తుందని ఇందులో పేర్కొన్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వం మారిన ప్రతిసారీ.. ఇలాంటి రాజీనామాల పర్వం చోటు చేసుకుంటూ ఉంటుంది. దమ్మాలపాటి శ్రీధర్ను చంద్రబాబు ప్రభుత్వం అడ్వకేట్ జనరల్గా నియమించిన విషయం తెలిసిందే. తాజాగా రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ నేపథ్యంలో- గత ప్రభుత్వం నియమించిన అధికారులు లేదా ఇతర రంగాలకు చెందిన వ్యక్తులు తమ పదవులకు రాజీనామా చేయడం ఆనవాయితీ.
కోడె దుర్గా ప్రసాద్ రాజీనామా..
హోమ్శాఖ సలహాదారుగా ఉన్న పదవీ విరమణ చేసిన ఐపీఎస్ అధికారి కోడె దుర్గా ప్రసాద్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ఆమోదిస్తూ హోమ్ శాఖ ప్రత్యేక ఇన్ఛార్జి ముఖ్య కార్యదర్శి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. పదవీ విరమణ చేసిన కోడె దుర్గా ప్రసాద్ను చంద్రబాబు ప్రభుత్వమే హోమ్ శాఖ సలహాదారుగా నియమించింది.