సీమకు సర్కార్ వరం: హెల్త్ యూనివర్శిటీ ఏర్పాటు దిశగా: 33 సంవత్సరాల తరువాత!
చిత్తూరు: రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతంగా గుర్తింపు ఉన్న రాయలసీమ ప్రాంత అభివృద్ధి దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో హెల్త్ యూనివర్శిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనికి అవసరమైన అనుమతులు, నిధులను అందజేయాలని కోరుతూ త్వరలోనే కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపించనుంది. తిరుపతిలో.. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలో పనిచేస్తోన్న శ్రీ వెంకటేశ్వర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్) ఆసుపత్రి ప్రధాన కేంద్రంగా హెల్త్ యూనివర్శిటీని ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వం యోచన. దీనిపై అధ్యయనం చేయడానికి త్వరలోనే ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయబోతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయానికి అదనంగా ఇది పనిచేస్తుంది.
ప్రస్తుతానికి ఒక్కటే..
ప్రస్తుతం రాష్ట్రంలో ఒక్క హెల్త్ యూనివర్శిటీ మాత్రమే ఉంది. 1986లో అప్పటి ప్రభుత్వం విజయవాడలో దీన్ని నెలకొల్పింది. విజయవాడ శివార్లలోని గుణదలలో 1986 నవంబర్ 1వ తేదీన రాష్ట్రావతరణ దినోత్సవాలను పురస్కరించుకుని అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు దీన్ని ప్రారంభించారు. 1998లో ఆ యూనివర్శిటీ పేరును మార్చారు. డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంగా పేరు పెట్టారు. 33 సంవత్సరాలుగా ఆరోగ్యరంగంలో ఆ ఒక్క యూనివర్శిటీ మాత్రమే పనిచేస్తోంది. వైద్య విద్యా బోధన పరమైన అన్ని కార్యకలాపాలు ఈ యూనివర్శిటీ కేంద్రంగా కొనసాగుతున్నాయి. నీట్ వంటి పరీక్షల నిర్వహణను పర్యవేక్షిస్తోంది కూడా ఈ యూనివర్శిటీ అధికారులే. ప్రస్తుతం ఈ ఒకటే కొనసాగుతున్న నేపథ్యంలో.. దీనిపై ఒత్తిడి అధికంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఏటేటా వైద్య విద్యను అభ్యసించే విద్యార్థుల సంఖ్య లక్షల్లో ఉండటం వల్ల వారి పర్యవేక్షణ కష్టతరమైందనే అభిప్రాయాలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి.
33 సంవత్సరాల తరువాత..
సుమారు 33 సంవత్సరాల తరువాత తొలిసారిగా మరో హెల్త్ యూనివర్శిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని గుర్తించింది రాష్ట్ర ప్రభుత్వం. వైద్య విద్యారంగంలో, వైద్య కళాశాల ప్రవేశాల్లో కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలకమైన మార్పులు చేర్పులు చేయడంతో.. మరో యూనివర్శిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరంత ఎంతైనా ఉందని వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. నీట్ వంటి పరీక్షల నిర్వహణ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాల్సిన బాధ్యత ఉన్నందున.. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీకి అదనంగా మరో వర్శిటీని స్థాపించాలనే నిర్ణయానికి వచ్చింది ప్రభుత్వం. దీనికోసం రాయలసీమ ప్రాంతాన్ని ఎంచుకుంది. తిరుపతిలో ఇప్పటికే అన్ని వసతులతో కొనసాగుతున్న స్విమ్స్ కేంద్రంగా హెల్త్ యూనివర్శిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చింది. రాయలసీమలోని కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురంలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలను దీని పరిధిలోకి తీసుకుని రావాలని ప్రాథమికంగా నిర్ణయించింది ప్రభుత్వం.
త్వరలో నిపుణుల కమిటీ..
స్విమ్స్ ప్రధాన కేంద్రంగా హెల్త్ యూనివర్శిటీ ఏర్పాటు చేయడానికి గల అవకాశాలపై అధ్యయనం చేయడానికి ప్రభుత్వం త్వరలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేయనుంది. వైద్య, ఆరోగ్యం, ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖల ముఖ్య కార్యదర్శులు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీకి చెందిన కొందరు ప్రొఫెసర్లు, వైద్య విద్యా బోధనలో నిష్ణాతులైన మరి కొందరిని ఈ నిపుణుల కమిటీలో నియమించవచ్చని తెలుస్తోంది. అనంతరం- యూనివర్శిటీ ఏర్పాటు చేయడానికి గల అవకాశాలు, నిపుణుల కమిటీ రూపొందించిన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపించనుంది. యూనిర్శిటీ స్థాయి విద్యా సంస్థను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి కావడం తప్పనిసరి. దేశవ్యాప్తంగా సుమారు 70 వైద్య కళాశాలలను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవలే అనుమతి ఇచ్చింది. ఇందులో భాగంగా.. రాష్ట్రానికి మంజూరు అయ్యే వైద్య కళాశాలను యూనివర్శిటీ మార్చాలని ప్రభుత్వం కేంద్రాన్ని కోరబోతోంది.