కరోనా పేషెంట్లకు సంజీవిని: మంగళగిరి ఎయిమ్స్లో అందుబాటులో: ఏపీ అభ్యర్థనకు కేంద్రం ఓకే
గుంటూరు: రోజురోజుకూ భయానకంగా విస్తరిస్తోన్న కరోనా వైరస్ను నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం ప్లాస్మా థెరపీని ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన కొన్ని ఆసుపత్రుల్లో ప్లాస్మా థెరపీ ద్వారా కరోనా వైరస్ పేషెంట్లకు చికిత్సను అందించడానికి దశలవారీగా అనుమతులను ఇస్తోంది. దేశ రాజధానిలోని లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆసుపత్రిలో తొలిసారిగా నిర్వహించిన ఈ ప్లాస్మా థెరపీ సత్ఫలితాలను ఇచ్చింది. దీనితో అఖిల భారత వైద్య విజ్ఙాన సంస్థ (ఎయిమ్స్) ఈ వైద్య విధానాన్ని అడాప్ట్ చేసుకుంది.
ప్లాస్మా థెరపీ ద్వారా
కొన్ని రాష్ట్రాల్లో పరిమితంగా ప్లాస్మా థెరపీ ద్వారా కరోనా వైరస్ బారిన పడిన వారికి వైద్య చికిత్సను అందిస్తున్నారు. ఈ ప్లాస్మా థెరపీ.. ఇక మన రాష్ట్రంలోనూ ఆరంభం కాబోతోంది. గుంటూరు జిల్లా మంగళగిరిలో నెలకొల్పిన ఎయిమ్స్ ఆసుపత్రిలో ప్లాస్మా థెరపీ ద్వారా కరోనా వైరస్ పేషెంట్లకు వైద్య చికిత్సను అందించడానికి కేంద్రం ప్రభుత్వం నుంచి అనుమతులు లభించినట్లు చెబుతున్నారు. తమ రాష్ట్రంలో ఈ తరహా వైద్యాన్ని నిర్వహించడానికి అనుమతులను ఇవ్వాలంటూ ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనలను కేంద్రం అంగీకరించినట్లు సమాచారం.
చికిత్స అందించడం వల్ల
ప్రస్తుతం ప్లాస్మా థెరపీ ద్వారా కరోనా పేషెంట్లకు ఢిల్లీలో వైద్య చికిత్సను అందజేయడాన్ని ముమ్మరం చేశారు. తొలిదశలో నలుగురికి ఈ విధానంలో చికిత్స అందించడం వల్ల వారు కోలుకున్నారు. కరోనా బారిన పడి కోలుకున్న వ్యక్తి నుంచి ప్లాస్మాను సేకరిస్తారు. దాన్ని ఇతర పేషెంట్ల శరీరంలోకి ఇంజెక్ట్ చేస్తారు. ఈ ప్లాస్మా ఆధారంగా కరోనా వైరస్ను నాశనం అవుతుందని డాక్టర్లు వెల్లడించారు. లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆసుపత్రిలో నిర్వహించిన ఈ చికిత్స విజయవంతం కావడం వల్ల దశలవారీగా అన్ని రాష్ట్రాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో దీన్ని ప్రవేశపెట్టనున్నారు.
వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ
మంగళగిరిలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో ఈ ప్లాస్మా విధానంలో వైద్య చికిత్స చేయడానికి కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా ఆదేశాలను జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇంటర్ మినిస్టీరియల్ సెంటర్ కమిటీ సూచనల మేరకు ఆరోగ్య శాఖ అధికారులు ఈ ఉత్తర్వులను వెలువడించినట్లు సమాచారం. దీనికోసం డాక్టర్లు, సాంకేతిక నిపుణులతో కూడిన రెండు వేర్వేరు బృందాలను ఏర్పాటు చేశారని అంటున్నారు. కాగా..ఎప్పటి నుంచి ప్లాస్మా థెరపీ ద్వారా వైద్య చికిత్సను ఆరంభిస్తారనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఢిల్లీలోని ఎయిమ్స్ బృందం మంగళగిరిని సందర్శించిన తరువాతే ప్లాస్మా థెరపీని అమలు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.