ఏపీ ప్రభుత్వ టీచర్లకు శుభవార్త... బదిలీలకు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్కూల్ టీచర్లకు ఇది శుభవార్త. మూడేళ్ల నిరీక్షణకు తెరదించుతూ ప్రభుత్వం టీచర్ల బదిలీలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆన్లైన్ వెబ్ కౌన్సిల్ ఆప్షన్ల ఆధారంగా బదిలీల ప్రక్రియ చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలిచ్చింది. ప్రభుత్వ నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 29వ తేదీ నాటికి రెండేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న ఉపాధ్యాయులందరూ బదిలీలకు అర్హులుగా ప్రభుత్వం నిర్ణయించింది. టీచర్లకు స్కూళ్ల ఎంపిక ఆప్షన్ల నమోదు నుంచి బదిలీ ఉత్తర్వులు వచ్చే వరకు పూర్తి ప్రక్రియ ఆన్లైన్లోనే జరగనుంది.
టీచర్ల బదిలీలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల క్రితమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో సోమవారం(అక్టోబర్ 12) దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి. బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ఎంప్లాయిస్ ఫెడరేషన్ నాయకులు ఇప్పటికే సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి విద్యాశాఖపై సీఎం జగన్ ప్రత్యేక ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. నాడు నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పోరేట్ స్కూళ్లకు ధీటుగా మారుస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లు రీఓపెన్ అయ్యే నాటికి అన్ని రకాల మౌలిక వసతులు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం సీఎం ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతూ అవసరమైన సలహాలు,సూచనలు చేస్తున్నారు.
అన్లాక్ 5లో భాగంగా కేంద్రం స్కూళ్లు,విద్యా సంస్థలను తెరిచేందుకు అనుమతులివ్వడంతో నవంబర్ తొలి వారంలో ప్రభుత్వ స్కూళ్లను తెరిచేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.