ఏపీలో మళ్లీ రంగుల వ్యవహారం: ప్రభుత్వ పాఠశాలలకు కొత్త కలర్లు: కోర్టులకెక్కే ఛాన్స్ లేకుండా
అమరావతి: రాష్ట్రంలో మరోసారి రంగుల వ్యవహారం తెర మీదికి వచ్చింది. పంచాయతీ కార్యాలయాలు సహా గ్రామస్థాయిలో ఉండే ప్రభుత్వ భవనాలకు వేయడానికి ఎంపిక చేసిన రంగులపై రాష్ట్రంలో ఏ స్థాయిలో రాజకీయ దుమారం చెలరేగిందో చెప్పుకోనక్కర్లేదు.
పంచాయతీలు, ప్రభుత్వ భవనాలకు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలోని రంగులను అద్దాలంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు కోర్టులకెక్కారు. ఈ వ్యవహారంలో జగన్ సర్కార్కు అన్నీ ప్రతికూల ఫలితాలే ఎదురు అయ్యాయి. హైకోర్టు ఆదేశాలతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది.
ఈ పరిస్థితుల్లో మరోసారి రంగుల వ్యవహారాన్ని తెర మీదికి తీసుకొచ్చింది ప్రభుత్వం. ప్రభుత్వ పాఠశాలలకు కొత్తగా రంగులను వేయాలని నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు రేపో, మాపో వెలువడబోతున్నాయి.
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను చూడగానే ఆకట్టుకునేలా తీర్చిదిద్దబోతోంది. నాడు-నేడు పథకంలో భాగంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలకు రంగులను వేయడానికి సన్నాహాలు చేపట్టబోతంది. ప్రభుత్వ పాఠశాలలకు వేయాల్సిన రంగులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖరారు చేశారు కూడా. పాఠశాల భవనానికి మొత్తానికి లేత గోధుమ రంగును వేస్తారు.
భవనం పైభాగం, కింది భాగాల్లో అంచులను టెర్రాకోట కలర్లతో తీర్చిదిద్దుతారు. పాఠశాల గోడలపై చిన్నపిల్లల బొమ్మలు, కార్టూన్లను చిత్రీకరిస్తారు. ఆంగ్ల అక్షరాలతో అందంగా అలంకరిస్తారు. ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాల భవనాల్లో ఆహ్లాదకర వాతావరణాన్ని తీసుకుని రానుంది ప్రభుత్వం.
Recommended Video
పాఠశాలలు పునఃప్రారంభం అయ్యే సమయానికి ఈ పనులన్నింటినీ పూర్తి చేయాలని వైఎస్ జగన్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడంలో రాజీపడ కూడదని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని చెప్పారు.