ప్రభుత్వ సేవల చట్టం అమల్లోకి...సకాలంలో పని చేయకుంటే జరిమానా
అమరావతి: పౌర సేవలకు సంబంధించి అతా ముఖ్యమైన నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ప్రజలకు నిర్ణీత కాలవ్యవధిలో ప్రభుత్వ సేవలను అందించని గవర్నమెంట్ ఉద్యోగులకు,సిబ్బందికీ అపరాధ రుసుం విధించేందుకు ఎపి ప్రభుత్వం సంసిద్దమైంది.ఇందుకోసమే రూపొందించిన, ఆమోదించిన ప్రత్యేక చట్టాన్ని ఎపి ప్రభుత్వం మంగళవారం గెజిట్ రూపంలో విడుదల చేసింది.
Recommended Video
ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ప్రజలకు సేవలు అందే విషయమై జాప్యాన్ని, ఇతర అక్రమాలను అరికట్టేందుకు ఎపి ప్రభుత్వం విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుంది. సామాజికవేత్త అన్నా హజారే, లోక్ సత్తా అధినేత జెపి వంటి మేధావులు కోరుతున్న పౌర సేవా చట్టాన్ని కొన్ని మినహాయింపులతో ఎపిలో అమలు చేసేందుకు ప్రభుత్వం సమాయత్తమైంది.
ఎట్టకేలకు అమల్లోకి...ప్రభుత్వ సేవల చట్టం
నిర్థిష్ట గడువులోగా పౌర సేవలు అందించని ప్రభుత్వాలను ప్రజలు నిలదీసేందుకు పౌర సేవా చట్టం ఉండాలని అన్నా హజారే వంటి సామాజికవేత్తలు, ఎపికి సంబంధించి లోక్ సత్తా అధినేత జెపి గత కొన్నేళ్లుగా ఒక ఉద్యమంలా చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎపి ప్రభుత్వం ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసెస్ డెలివరీ గ్యారంటీ యాక్టు - 2017 బిల్లును గత అక్టోబరులో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. శాసనసభ, శాసనమండలి సమావేశాల్లో ఈ బిల్లు ఆమోదం పొందగా, తాజాగా చట్టంగా అమల్లోకి వచ్చింది. ప్రభుత్వ సేవల్లో పారదర్శకత, సమయపాలనకు ప్రాధాన్యత నిస్తూ ప్రజా సేవలను నిర్ణీత కాలవ్యవధిలో అందించేందుకు ఈ చట్టాన్ని రూపొందించడం జరిగింది.
పౌరులకు...ఎన్నో ప్రయోజనాలు...
ఈ చట్టం ప్రకారం ప్రభుత్వ కార్యాలయాల్లో పౌర సేవలను నిర్ణీత కాలవ్యవధిలో పొందే హక్కు ప్రతి పౌరుడికీ ఉంటుంది. భారత రాజ్యాంగం ప్రకారం పనిచేసే అన్ని ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు నిరంతరం ఆన్లైన్లో సేవలను అందించాలి. ప్రభుత్వ సేవల కోసం దరఖాస్తు చేసుకున్న వెంటనే వాటిని ఆన్లైన్లో నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించాలి. ఈ పరిష్కార సమయంలో ఉద్యోగులు ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా వ్యవహరించాలి. అలాగే పౌర సేవల కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తి, తన ధరఖాస్తులో అవసరమైన ధృవ పత్రాలన్నీ జత చేయాలి.
పర్యవేక్షణ కోసం...ప్రత్యేక అథారిటీ...
రాష్ట్ర ప్రభుత్వ శాఖలు తమ పరిధిలో పౌర సేవలు ఎలా అమలు జరుగుతున్నాయో పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఒక అథారిటీని నియమిస్తాయి. ఎవరైనా తమ దరఖాస్తులు సకాలంలో పరిష్కారం కాలేదంటూ ఈ అథారిటీకి అప్పీలు చేస్తే... ఆ అథారిటీ వాటిని పరిశీలించి అందుకు కారణాలను విశ్లేషిస్తుంది. సహేతుకమైన కారణం లేకుండా దరఖాస్తులను పెండింగ్లో పెట్టినట్లు రుజువైతే అలా పెండింగ్ లో పెట్టిన సంబంధిత అధికారికీ, సిబ్బందికీ అపరాధ రసుము విధించడం జరుగుతుంది.
ఈ చట్టం...ప్రజలకు ఎంతో ప్రయోజనకారి...
ప్రభుత్వ కార్యాలయంలో నిర్ణీత పని నిమిత్తం ధరఖాస్తు చేసుకునేప్పుడు మాత్రమే సంబంధిత శాఖాధికారిని కలవాల్సి అవసరం ఉంటుంది. ఆ తరువాత తమ ఫైలు పరిష్కారం కోసం ఏ అధికారిని కలసి విన్నవించాల్సిన అవసరం లేదు. పైగా ఈ-ఫైలింగ్ విధానంలోనే ప్రభుత్వ శాఖలన్నీ సేవలు అందించాల్సి ఉంది. అంతేకాదు ధరఖాస్తును పరిష్కరించేందుకు తీసుకున్న సమయం...ఏమైనా అభ్యంతరాలు...వాటిని నివృత్తి చేసుుకునేందుకు చేసిన ప్రయత్నాలు వీటన్నింటి గురించి ఆన్లైన్లో అధికారులు వివరించాల్సి ఉంటుంది. పౌర సేవలకు సంబంధించి ఎంతో ప్రయోజనకారి అయిన ఈ చట్టాన్ని ప్రభుత్వం చిత్తశుద్దితో అమలు చేసినట్లయితే ప్రజల మెప్పు పొందడం ఖాయమని చెప్పొచ్చు.