ఏపీలో ఇంజినీరింగ్ పరీక్షల నిర్వహణ ఇప్పుడే వద్దు: ప్రభుత్వాన్ని కోరిన పవన్..
ఆంధ్రప్రదేశ్లో ఇంజినీరింగ్ విద్యార్థులకు సెమిస్టర్ పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పరీక్షలు నిర్వహించాలని భావిస్తోన్న ప్రభుత్వం.. ఈ మేరకు ఏర్పాట్లు కూడా చేస్తోంది. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తోన్నందున.. పరీక్షల నిర్వహణను వాయిదా వేయాలని జనసేన పార్టీ కోరుతోంది. ఈ మేరకు అధినేత పవన్ కల్యాణ్ పేరుతో ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది పార్టీ. మరికొంత సమయం తర్వాత పరీక్షలు నిర్వహిస్తే బెటర్ అనే అభిప్రాయాన్ని అందులో పవన్ కల్యాణ్ వ్యక్తం చేశారు.
ఇంజినీరింగ్ సెమిస్టర్ పరీక్షల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. అయితే విద్యార్థులు, తల్లిదండ్రులు మాత్రం పరీక్షలు నిర్వహించొద్దనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కాస్త టెన్షన్ వాతావరణం నెలకొంది. స్టూడెంట్స్, పేరంట్స్ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నత విద్యామండలి పరిగణనలోకి తీసుకోవాలని పవన్ కల్యాణ్ సూచించారు. వైరస్ విజృంభణతో మార్చి నుంచి విద్యాసంస్థలు మూసివేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు పరీక్షలు నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తోన్న క్రమంలో.. పవన్ కల్యాణ్ స్పందించారు.
పరీక్షల నిర్వహణపై తమకు సమాచారం ఇవ్వలేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఏకంగా అందించకుండా సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ ప్రకటించడంపై గుర్రుమీదున్నారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయని.. ఇలాంటి పరిస్థితుల్లో పరీక్షలకు వెళ్లేందుకు విద్యార్థులు జంకుతున్నారని పవన్ కల్యాణ్ తెలిపారు. తల్లిదండ్రులు కూడా భయపడుతున్నారని వివరించారు. దీనిపై ప్రభుత్వం ఇప్పటికైనా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. యూజీసీ మార్గదర్శకాల మేరకు సెమిస్టర్ పరీక్షల నిర్వహణను నిలిపివేయాలన్నారు.