దేవుడు కురిపించిన వర్షాలకు..: ఇబ్బందికి కారణం అదేనన్న గవర్నర్
తిరుపతి: కట్టకూడని చోట ఇల్లు కట్టుకున్నందుకే వర్షాల వల్ల ఇబ్బంది తలెత్తిందని తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ అభిప్రాయపడ్డారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బాగా పనిచేస్తున్నారని ప్రశ్నించారు. ఆదివారం ఆయన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.
ఆ తర్వాత ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నార మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా - గుంటూరులో ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు కమాండ్ కంట్రోల్లో కూర్చుని పరిస్థితి సమీక్షిస్తున్నారని, తెలంగాణలో కేసీఆర్ మార్గనిర్దేశం చేస్తున్నారని ఆయన చెప్పారు.
తెలంగాణలో కేటీఆర్, మరికొందరు మంత్రులు, అధికారులూ పని చేస్తున్నారని చెప్పారు. దేవుడు కురిపించిన వర్షానికి ఇంకా ఏం చేయగలరని అడిగారు. అయితే మనమే ఎక్కడ కట్టకూడదో అక్కడ ఇల్లు కట్టుకున్నామని అన్నారు. నాలాలపై ఇల్లు కట్టుకున్నది ఎవరు? ప్రభుత్వం కాదుకదా? స్థలం నాలా మీద ఉందని తెలిసి పర్మిషన్ ఎందుకు తీసుకున్నారు? ఎందుకు ఇల్లు కట్టుకున్నారు? తప్పులు చేసేది మనమే అని అన్నారు.
మొదట మనం తప్పులు దిద్దుకుని ప్రభుత్వాన్ని తప్పుపట్టాలని, ప్రభుత్వం ఏమీ స్వర్గం నుంచి ఊడిపడదని, ఇది మీదీ, మాదీ మనందరిదీ అని గవర్నర్ అన్నారు. ఒకవేళ అక్రమ నిర్మాణాలను గుర్తించి కూలిస్తే పేద ప్రజల ఇళ్లను అన్యాయంగా కూల్చేశారని ప్రభుత్వంపై మీరు కూడా దండయాత్ర చేస్తారని మీడియాను ఉద్దేశించి అన్నారు.
అంతకుముందు తిరుమలకు వచ్చిన గవర్నర్ నరసింహనకు టీటీడీ ఈవో సాంబశివరావు, జేఈవో శ్రీనివాసరాజు ఘనంగా స్వాగతం పలికారు. నరసింహన్ మహద్వారంగుండా ఆలయంలోకి చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాలకు చాలా చక్కటి ఏర్పాట్లు చేశారని అధికారులను అభినందించారు.