విభజన: గవర్నర్ కీలక నివేదిక, హైదరాబాద్ పైనా!
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో న్యూఢిల్లీలో ఉన్న గవర్నర్ నరసింహన్ ప్రధానమంత్రి కార్యాలయం, ఇంటెలిజెన్స్ బ్యూరోలకు ఓ నివేదిక ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అందులో ఆయన రాష్ట్ర పరిస్థితులు వివరించడంతో పాటు విభజన నిర్ణయం నేపథ్యంలో ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొంటామని పేర్కొన్నారట. విభజన నిర్ణయం నేపథ్యంలో కేంద్రం త్వరగా చర్యలు తీసుకోవాలని, శాంతిభద్రతల సమస్య తప్పదని, అయితే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటామని పేర్కొన్నారట.
విభజన సందర్భంగా రాష్ట్రంలో ఊహించినట్లే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని, దాని ప్రభావాన్ని తగ్గించాలంటే కేంద్ర ప్రభుత్వం త్వరగా చర్యలు తీసుకోవాలని, ఆ చర్యల గురించి ప్రజలకు తెలిసేలా చూడాలని సూచించినట్లు సమాచారం. ఢిల్లీ పర్యటనలో భాగంగా నరసింహన్ బుధవారం, గురువారం బిజీబిజీగా గడిపారు. రాష్ట్ర విభజనపై కేంద్రం నియమించిన మంత్రుల బృందం సభ్యులు ఎకె ఆంటోనీ, వీరప్ప మొయిలీతోపాటు సీమాంధ్రకు చెందిన జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశి వరావులను గురువారం కలిశారు.
ఆంటోనీ నివాసానికి వెళ్లి గవర్నర్ భేటీ అయ్యారు. అలాగే, ప్రధానమంత్రి కార్యాలయ ఉన్నతాధికారులు, ఇంటెలిజెన్స్ అధికారులతో కూడా నరసింహన్ సమావేశం కావటం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. సమాచారం మేరకు.. రాష్ట్ర విభజన సందర్భంగా నక్సలైట్లను ఎదుర్కొనేందుకు ప్రత్యేక వ్యూహం, హైదరాబాద్ సమస్యకు పరిష్కారంపై పిఎంవో, ఐబి ఉన్నతాధికారులకు గవర్నర్ నివేదికలు ఇచ్చారు.
విభజన జరిగిన తర్వాత నక్సలైట్ సమస్య ఇరు ప్రాంతాల్లో ఎలా ఉంటుంది, తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి అనే దానిపై నివేదికలో పొందుపర్చారట. నక్సలైట్ సమస్య పాక్షికంగానే ఉందని పేర్కొన్నారట. హైదరాబాద్పై కూడా కీలకమైన నివేదికను ఇచ్చినట్లు తెలుస్తోంది. విభజన విషయంలో హైదరాబాద్పై సీమాంధ్ర ప్రజల్లో ఉన్న మనోభావాలను తక్కువగా చూడకూడదని గవర్నర్ పేర్కొన్నట్లు సమాచారం.
హైదరాబాద్ను మరిపించేలా సీమాంధ్ర రాజధానిని వెంటనే ఏర్పాటు చేయాలని, ఆ మేరకు ప్రజలకు ప్రత్యక్షంగా తెలిసే చర్యల్ని తీసుకుంటే ఆందోళనలు తగ్గొచ్చని గవర్నర్ సూచించారు. అదే సమయంలో హైదరాబాద్కున్న బ్రాండ్ ఇమేజ్ తగ్గకుండా చూసుకోవాల్సి ఉంటుందని చెప్పినట్లు సమాచారం.