ఉభయ సభల్లో గవర్నర్ ప్రసంగం: వైఎస్ జగన్ లక్ష్యాలకు ప్రతిబింబం!
అమరావతి: రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వంలో మరో అంకం ముగిసింది. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్.. శుక్రవారం శాసనసభ, శాసన మండలిని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు. ప్రభుత్వ గమనాన్ని నిర్దేశించారు. అవినీతి రహిత పరిపాలన, రాష్ట్ర సమగ్రాభివృద్ధి, చిట్టచివరి వ్యక్తికి కూడా సంక్షేమ పథకాల లబ్దిని అందించడం ప్రధాన లక్ష్యంగా తన ప్రభుత్వ పరిపాలన సాగుతుందని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి అవాంతరాలు ఎదురైనా, ఎలాంటి కష్టసాధ్యమైన లక్ష్యాన్నయినా అందుకుంటామని వెల్లడించారు. గవర్నర్ ప్రసంగం ముగిసిన వెంటనే- స్పీకర్ తమ్మినేని సీతారాం సభను సోమవారానికి వాయిదా వేశారు.
తొలుత శాసన సభ్యుల ప్రమాణ స్వీకారంతో ఆరంభమైన సమావేశాల్లో ఒక్కో ముందడుగు పడుతూ వచ్చింది. తొలిరోజు సభ్యుల ప్రమాణ స్వీకారం, రెండోరోజు స్పీకర్ ఎన్నిక, మూడో రోజుకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ముగిసింది.
చిట్ట చివరి వ్యక్తికీ సంక్షేమ పథకాల లబ్ది..
సమాజంలో చిట్ట చివరి వ్యక్తి వరకు సంక్షేమ పథకాల లబ్దిని అందించడానికి అన్ని చర్యలు తీసుకుంటామని గవర్నర్ అన్నారు. దీనికోసం గ్రామ వలంటీర్ల వ్యవస్థకు రూపకల్పన చేశామని వివరించారు. ప్రతి 50 గ్రామాలను ఒక యూనిట్గా తీసుకుని, సంక్షేమ పథకాల లబ్దిని ప్రతి ఇంటికీ డోర్ డెలివరి చేస్తామని అన్నారు. గ్రామ వలంటీర్లు అవినీతికి పాల్పడకుండా ఉండటానికి వారికి ప్రతినెలా 5000 రూపాయల గౌరవ వేతనాన్ని అందిస్తామని గవర్నర్ తన ప్రసంగంలో స్పష్టం చేశారు.
విభజన అంశాలు, గత ప్రభుత్వ వైఖరి..
తన ప్రసంగం సందర్భంగా గవర్నర్ అనేక అంశాలను ప్రస్తావించారు. ప్రభుత్వ లక్ష్యాలను సభ్యుల ముందుంచారు.
రాష్ట్ర విభజన తరువాత ఏర్పడిన ఇబ్బందులు సహా గత ప్రభుత్వ హయాంలో సంభవించిన దుర్వినియోగాన్ని ఆయన తన ప్రసంగంలో పొందుపరిచారు. వైఎస్ జగన్ నేతృత్వంలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలపడంతో గవర్నర్ ప్సంగం ఆరంభమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆశయాలను ఆయన ప్రసంగం ప్రతిబింబించింది.
మేనిఫెస్టో..ఓ పవిత్రగ్రంథం
ఎన్నికల మేనిఫెస్టోను ఓ భగవద్గీతలా, ఓ ఖురాన్లా, ఓ బైబిల్గా పవిత్రంగా భావిస్తామని, అందులో పొందుపరిచిన అంశాలు, లక్ష్యాలను సాధించడానికి తన ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని గవర్నర్ తెలిపారు. రాష్ట్రానికి గుండెకాయగా భావించే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని అన్నారు. పాలనలో సంస్కరణలో తీసుకొస్తామని, ప్రజలకు సుపరిపాలన అందిస్తామని చెప్పుకొచ్చారు. అపరిష్కృతంగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికి నిధులు అవసరం అవుతాయని, దీనికోసం కేంద్రం సహకరించాల్సి ఉందని చెప్పారు.
వైఎస్ జగన్ ఆశయాలివే..
రాష్ట్రంలో అవినీతి రహిత పాలనను అందించడానికి తన ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని గవర్నర్ అన్నారు. దీనికోసం ఇప్పటికే జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఇప్పటికే ఈ దిశగా న్యాయమూర్తులతో సంప్రదింపులను చేపట్టినట్లు వివరించారు. అవినీతిని రూపుమాపడం ద్వారా, దేశంలో ఆదర్శవంతమైన, సుపరిపాలన దిశగా అడుగులు వేస్తామని గవర్నర్ వివరించారు. ప్రజల అకాంక్షలను ప్రతిఫలించేలా తన ప్రభుత్వ పరిపాలన కొనసాగుతుందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
రివర్స్ టెండరింగ్..
భారీ నీటి ప్రాజెక్టుల కాంట్రాక్ట్, టెండర్ల నిర్వహణ, అంచనాలను పునఃసమీక్షిస్తామని గవర్నర్ తెలిపారు. దీనివల్ల అంచనాలు ఎందుకు పెరిగాయో స్పష్టమౌతుందని చెప్పారు. అవసరమైతే రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేస్తామని నరసింహన్ స్పష్టం చేశారు. రివర్స్ టెండరింగ్ ద్వారా అవసరానికి మించి నిధులు వ్యయం చేసినట్లు తేలితే.. వాటిని రికవర్ చేస్తామని అన్నారు. ఇలా రికవర్ చేయడం ద్వారా వచ్చిన నిధులను సంక్షేమ పథకాలను అమలు చేయడానికి బదలాయిస్తామని గవర్నర్ చెప్పారు.
విభజన హామీల కోసం కేంద్రంపై ఒత్తిడి..
రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చుకునే దిశగా అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటామని గవర్నర్ శాసనసభకు భరోసా ఇచ్చారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించే దిశగా కేంద్రంపై ఒత్తిడిని తీసుకొస్తామని, ఇందులో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని అన్నారు. దీనితోపాటు- పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలన్నింటినీ పరిష్కరించేలా, అందులో పొందుపరిచిన డిమాండ్లను సాధించుకునే దిశగా అడుగులు వేస్తామని అన్నారు.