కెసిఆర్కు ట్యాపింగ్ చిక్కు, బాబుకు రేవంత్ తలనొప్పి: ఎట్ హోంలో కలుస్తారా?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావులు మరోసారి కలుసుకుంటారా? విభజన సమస్యల పైన చర్చించుకుంటారా? అదే సమయంలో ఫోన్ ట్యాపింగ్, ఓటుకు నోటు అంశాలపై మాట్లాడుకుంటారా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.
ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనంతరం ఇరువురు ముఖ్యమంత్రులు ఎప్పుడు కూడా నేరుగా కలుసుకోలేదు. అంతకుముందు విభజన సమస్యల పైన కెసిఆర్, చంద్రబాబులు గవర్నర్ నరసింహన్ సమక్షంలో ఒకటి రెండుసార్లు మాట్లాడుకున్నారు.
అయితే, ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనంతరం ఇరు పార్టీల మధ్య రాజకీయ వేడి మరింత ఎక్కువ అయింది. ఈ కేసుల విషయంలో చంద్రబాబు, కెసిఆర్లు పోటీ పడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఒకరు నోటీసులు ఇస్తే, మరొకరు నోటీసులు ఇస్తున్నారు.
ఓటుకు నోటు కేసులో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి, చంద్రబాబు సహా పలువురు అడ్డంగా బుక్కయ్యారని టిఆర్ఎస్ నేతలు చెబుతుంటే, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కెసిఆర్ ప్రభుత్వం పడిపోవడం ఖాయమని టిడిపి చెబుతోంది. దీనిపై ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది.
ఈ నేపథ్యంలో ఇరువురు ముఖ్యమంత్రులు మళ్లీ కలుసుకుంటారాఅనే చర్చ సాగుతోంది. ఈ కేసుల వ్యవహారం బయటకు వచ్చాక ఒకటి రెండుసార్లు చంద్రబాబు, కెసిఆర్లు కలుసుకునే అవకాశం వచ్చినప్పటికీ కుదరలేదు.
ఇప్పుడు ఆగస్టు 15వ తేదీన గవర్నర్ నరసింహన్ ఎట్ హోం నిర్వహిస్తున్నారు. దీనికి చంద్రబాబు, కెసిఆర్లను ఆహ్వానించారు. ఎట్ హోంకు రాజ్ భవన్ వేదిక కానుంది. అయితే, ఈ సమావేశంలోనైనా కెసిఆర్, చంద్రబాబులు కలుస్తారా? విభజన సమస్యలపై చర్చించుకుంటారా? కేసుల అంశం చర్చకు వస్తుందా అనే ఆసక్తి అందరిలోను నెలకొంది.