గవర్నర్కు మంత్రుల జాబితా: ఆమోదించిన నరసింహన్: స్వయంగా ఫోన్ చేసి సమాచారం..!
ఏపీ ముఖ్యమంత్రి జగన్ గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు. తాను ఎంపిక చేసుకున్న టీం వివరాలతో జాబితాను గవర్నర్కు అందచేసారు. జగన్ తన తొలి కేబినెట్లో 25 మందికి అవకాశం కల్పించారు. ఎస్సీ-ఎస్టీ-బీసీ-మైనార్టీ-కాపు వర్గాలకు 50 శాతానికి పైగా మంత్రి పదవులు కేటాయించారు. స్పీకర్ పదవి సైతం బీసీ వర్గానికి ఖరారు చేసారు. గవర్నర్ నరసింహన్ శనివారం ఉదయం 11.49 గంటలకు వెలగపూడిలోని సచివాలయం సమీపంలో కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
25 మంది మంత్రుల జాబితా..
జగన్ తన డ్రీం కేబినెట్ను ఎంపిక చేసారు. 25 మందితో పూర్తి స్థాయి కేబినెట్ ఏర్పాటు చేస్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో చెప్పిన విధంగా ఎస్సీ-ఎస్టీ-బీసీ-మైనార్టీ-కాపు వర్గాలకు మొత్తం మంత్రి వర్గంలో స్థానం కల్పిస్తున్నారు. ఏపీలోని 13 జిల్లాలను పరిగణలోకి తీసుకొని ప్రాంతీయ-సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకొని జగన్ తన కేబినెట్ను సిద్దం చేసారు. ఈ సారి గతంలో ఎన్నడూ లేని విధంగా తన కేబినెట్లో అయిదుగురు ఉప మఖ్యమంత్రులుగా అవ కాశం ఇస్తున్నట్లుగా జగన స్వయంగా ప్రకటించారు. ఇక, గవర్నర్ నరసింహన్ ఇప్పటికే విజయవాడ చేరుకున్నారు. ఆయన రేపు ఉదయం 11.40 గంటలకు ప్రమాణ స్వీకార ప్రాంగణానికి చేరుకుంటారు. 11.49 గంటలకు 25 మందితో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
స్పీకర్గా బీసీ నేత..
ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ రాజకీయ నేత..బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారాంను ఏపీ శాసనసభ స్పీకర్గా జగన్ ఖరారు చేసారు. ఈ నెల 12నుండి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో తొలి రోజున ప్రొటెం స్పీకర్గా శంబంగి చిన అప్పల నాయుడు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ తరువాత 13వ తేదీన కొత్త స్పీకర్గా తమ్మినేని సీతారాం అధికారికంగా బాధ్యతలు స్వీకరిస్తారు. దీంతో..ఇక ఉప సభాపతిగా ఎవరికి అవకాశం ఇస్తారనేది ఆసక్తి కరంగా మారింది. మరో వైపు ముఖ్యమంత్రి హోదాలో జగన్ అధికారికంగా శనివారం ఏపీ సచివాలంలో ఎంట్రీ ఇస్తున్నారు. ఉదయం 8.42 గంటలకు ఆయన సచివాలయంలో ప్రవేశిస్తారు. మంత్రివర్గ ప్రమాణ స్వీకారం తరువాత జరిగే తొలి కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
సీఎం ప్రధాన కార్యదర్శిగా పీవీ రమేష్..
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పీవీ రమేష్ నియమితులయ్యారు. కేంద్ర సర్వీసుల్లో ఉన్న రమేష్ను రాష్ట్ర సర్వీసుల్లోకి ఆహ్వానించి ఈ కీలక పోస్టు కట్టబెట్టారు. ఆయన గతంలో వైద్య ఆరోగ్య శాఖ..ఆర్దిక శాఖల్లో కీలకంగా పని చేసారు. ఇక, ఆదనపు కార్యదర్శిగా జె మురళీ నియమితులయ్యారు. ఇక, ప్రమాణ స్వీకారానికి జాబితాకు గవర్నర్ ఆమోద ముద్ర లభించటంతో మంత్రులుగా ఎంపికైన వారికి విజయ సాయిరెడ్డి స్వయంగా ఫోన్ చేసి వారికి సమాచారం అందిస్తున్నారు.