షాకింగ్:గవర్నర్ నరసింహన్ ఢిల్లీ పర్యటన ఆకస్మిక రద్దు...ఏం జరుగుతోంది?
న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఢిల్లీ పర్యటనలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. రెండు రోజుల ఢిల్లీ పర్యటన కోసమని అక్కడకు బయలుదేరి వెళ్లిన గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఊహించని విధంగా తన పర్యటన రద్దు చేసుకొని తిరుగుముఖం పట్టారు.
గవర్నర్ నరసింహన్ తన రెండు రోజుల పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి రాజ్నాథ్ సింగ్, ఇతర కేంద్ర మంత్రులను కలవాల్సిఉంది. ఈ మేరకు ఆయనకు వారందరితో అపాయింట్మెంట్లు సైతం ఖరారయ్యాయని తెలుస్తోంది. అయితే కారణాలేమిటో తెలియదు కానీ అనూహ్యరీతిలో గవర్నర్ నరసింహన్ తన పర్యటనను రద్దు చేసుకొని హైదరాబాద్ కు తిరుగుప్రయాణం అయ్యారు. ఇలా గవర్నర్ తన పర్యటనను అర్థాంతరంగా రద్దు చేసుకొని తిరిగిరావడం సంచలనం సృష్టిస్తోంది.
ఢిల్లీ ప్రయాణం...అర్థాంతరంగా రద్దు...
ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ తో సమావేశం అయ్యేందుకు అపాయింట్మెంట్లు సైతం ఖరారు చేసుకొని రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం రాత్రికి ఢిల్లీకి చేరుకున్న ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్...ఏం జరిగిందో ఏమో కానీ ఎవరినీ కలవకుండానే బుధవారం ఉదయాన్నే హైదరాబాద్కు తిరుగు ప్రయాణం కావడం రాజకీయ వర్గాల్లో పెను ప్రకపంపనలు సృష్టిస్తోంది. అయితే గవర్నర్ నరసింహన్ డిల్లీ ప్రయాణమై వెళ్లిన వెంటనే ఆయన తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విమర్శల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గవర్నర్ పర్యటన రద్దవడం, ఆయన వెంటనే హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం కావడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.
పర్యటన ముందు...ఏం జరిగిందంటే
గవర్నర్ నరసింహన్ ఢిల్లీ ప్రయాణానికి ముందు మూడు రోజుల వ్యవధిలో తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్, చంద్రబాబులతో సమావేశం అయిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో వివిధ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆ సమావేశాలు గంటల కొద్దీ సాగడం ఆసక్తికరంగా మారింది. ఒకవైపు తెలంగాణా సిఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాలు, మరోవైపు ఏపిలో విభజన హామీలపై చంద్రబాబు విన్నపాలు, రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలు ఢిల్లీ పెద్దలకు వివరించేందుకు గవర్నర్ నరసింహన్ సంసిద్ధమై వెళ్లారని సమాచారం. అయితే గవర్నర్ నరసింహన్ ఢిల్లీ వెళ్లడంతోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆయనపై తీవ్ర ఆరోపణలు, విమర్శలు గుప్పించడం ఆరంభించారు.
చంద్రబాబు...ఏమన్నారంటే?
గవర్నర్ నరసింహన్ గురించి చంద్రబాబు తాజాగా చేసిన ఆరోపణలు, విమర్శలు ఇవి...టిడిపికి వ్యతిరేకంగా వివిధ పార్టీలను గవర్నరే కలుపుతున్నారనే వార్తలు పత్రికల్లో వస్తున్నాయని చంద్రబాబు అన్నారు. గవర్నర్ స్థానంలో ఉన్న ఒక వ్యక్తి ఆ విధంగా వ్యవహరించడం సరికాదని విమర్శించారు. అంతేకాదు...అసలు గవర్నర్ వ్యవస్థే వద్దని టీడీపీ గతంలోనే చెప్పిందని...ఆ అంశంపై పోరాటం కూడా చేశామని చెప్పారు. గవర్నర్ వ్యవస్థ ఒక పద్ధతి ప్రకారం పని చేసుకోవాలని, వార్తాపత్రికల్లో న్యూస్ వచ్చేలా గవర్నర్ వ్యవహరించడం మంచి పద్ధతి కాదని అన్నారు. తన గురించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యల గురించి ఢిల్లీ పర్యటనలో ఉన్న గవర్నర్ నరసింహన్ ఆరా తీసారని, ఆ తరువాత అనూహ్యంగా ఆయన పర్యటన రద్దవడం గమనార్హమనేది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ.
చంద్రబాబు విమర్శలపై...సోము వీర్రాజు స్పందన
మరోవైపు గవర్నర్ నరసింహన్ పై చంద్రబాబు విమర్శలను బిజెపి ఎమ్మెల్సీ సోమూ వీర్రాజు తిప్పికొట్టారు. నైతికత విలువలను పక్కనపెట్టి మరీ వైఎస్సార్సీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలతో మంత్రులుగా ప్రమాణం చేయించిన నాడు చంద్రబాబు దృష్టిలో గవర్నర్ నరసింహన్ దేవుడని, హోదా, విభజన చట్టాలపై కేంద్రంతో మాట్లాడుతానన్నప్పుడు చాలా మంచివారని, కానీ హఠాత్తుగా ఇప్పుడేమైందని సోమూ వీర్రాజు ప్రశ్నించారు. గవర్నర్ ది రాజ్యంగ పదవి అన్న ధ్యాస మర్చిపోయి ఆయనను ముఖ్యమంత్రి అవహేళన చేయడం ఎంతవరకు సబబని, ఎందుకు గవర్నర్ పై చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారో చెప్పాలన్నారు. దీని వెనుక కారణాలేంటి?...ఏమైనా భారీ గ్రౌండ్ ప్రిపరేషన్ చేస్తున్నారా?...చేస్తున్నారా అంటూ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇవేం వ్యాఖ్యలు...సిఎం ఇలా అనొచ్చా?
మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యల గురించి కూడా సోమూ వీర్రాజు విస్మయం వ్యక్తం చేశారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కోరని విధంగా "ప్రజలే నన్ను రక్షించాలని"...సిఎం చంద్రబాబు కోరడం విచిత్రంగా ఉందన్నారు. బాధ్యతగల ముఖ్యమంత్రి పదవిలో ఉండి ప్రజలే నన్ను రక్షించాలని అని చంద్రబాబు అనొచ్చా...ఆయనే అలా మాట్లాడితే రాష్ట్రంలో ప్రజలను కాపాడేది ఎవరు?...బీజేపీని తీవ్రస్థాయిలో వ్యతిరేకించే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ఇలా మాట్లాడలేదు. అసలు చంద్రబాబు వ్యాఖ్యల వెనుక అర్థమేంటి?...నిన్నటిదాకా గవర్నర్ను ప్రశంసలతో ముంచెత్తిన చంద్రబాబు...ఒక్కసారే యూటర్న్ తీసుకోవడానికి వెనుక కారణాలేంటి?...దీని గురించి ప్రజలు ఆలోచించాలి, చర్చించాలి...అని సోమూ వీర్రాజు వ్యాఖ్యానించారు.
గవర్నర్ రాగానే...ఏం జరుగుతుంది
గవర్నర్ నరసింహన్ ఢిల్లీ పర్యటన అర్థాంతరంగా ముగియడంతో ఆయన తిరిగి హైదరాబాద్ చేరగానే ఆయన ప్రతిస్పందన ఎలా ఉంటుందనేది ఉత్కంఠగా మారింది. షెడ్యూల్ ప్రకారం ప్రధాని మోడీతో భేటీ కాకపోవడం, ఆయన బిజీగా ఉన్నారనుకున్నా హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ తో నైనా సమావేశం కాకుండా అర్థాంతరంగా వెనుతిరిగి వచ్చేస్తున్న నేపథ్యంలో నరసింహన్ హైదరాబాద్ చేరుకోవడంతోనే ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఆయన వైపు నుంచి చర్యలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అయితే అవి దిద్దుబాటు దిశలో సామరస్యంగా ఉంటాయా?...లేక అనూహ్యంగా ఉంటాయా అనేది వేచి చూడాలి.