రాష్ట్రపతి పాలనకు గవర్నర్ సిఫార్సు: బిజెపికి కేంద్రం ఓకే
న్యూఢిల్లీ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్ నరసింహన్ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. బుధవారం మధ్యాహ్నం కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గవర్నర్ రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేస్తూ నివేదిక పంపించారు. సాయంత్రం కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు.
ఎమ్మెల్యే రాజీనామా
ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ ముసాయిదా బిల్లు)కు లోకసభ ఆమోదం తెలిపిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధి తంగిరాల ప్రభాకర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా పత్రాన్ని సభాపతికి పంపించారు.
ప్రధానితో షిండే భేటీ
కేంద్ర కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం ప్రధాని మన్మోహన్ సింగ్ తో కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత ఏర్పడ్డ పరిస్థితులు, రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు ఆమోదంపై చర్చిస్తున్నారు. రాజ్యసభలో ప్రధాని సీమాంధ్ర ప్యాకేజీ పైన ప్రకటన చేసే అవకాశముంది.
మరోవైపు బిల్లు విషయంలో బిజెపి సూచించిన ఆరు ప్రతిపాదనలకు కేంద్రం అంగీకారం తెలిపింది. ఈ మేరకు బిజెపి నేతలకు కేంద్రం లిఖిత పూర్వకంగా తెలిపింది. బిజెపి ప్రతిపాదనలపై ప్రధాని రాజ్యసభలో ప్రకటన చేయనున్నారు.