బిల్లు రాజకీయంలో కొత్త ట్విస్ట్: స్పీకర్..ఛైర్మన్ లకు గవర్నర్ పిలుపు: కేంద్రం ఆరా తీసిందా..!
మూడు రాజధానులు..సీఆర్డీఏ రద్దు బిల్లులు..మండలిలో సెలెక్ట్ కమిటీకి పంపాలని నిర్ణయం..దీని పైన అధికార..ప్రతిపక్ష రాజకీయాల మధ్య కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. గణతంత్ర దినోత్సవ కార్యక్రమం తరు వాత గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్ అటు శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారా..మండలి ఛైర్మన్ షరీఫ్ లను రాజ్ భవన్ కు పిలిపించారు. సభలో జరిగిన పరిణామాల గురించి ఆరా తీసారు. మండలి రద్దు చేస్తామంటూ ప్రభుత్వం చేసిన ప్రతిపాదన పైన పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చ..ఇప్పుడు గవర్నర్ జోక్యంతో మలుపు తిరిగింది.
శాసన మండలిలో చోటు చేసుకున్న పరిణామాల పైన టీడీపీ ఇప్పటికే గవర్నర్ ను కలిసి సభ లోపల చోటు చేసుకున్న పరిణామాలను వీడియో రూపంలో పెన్ డ్రైవ్ ద్వారా అందించింది. ఇదే సమయంలో ఛైర్మన్ పైన దురుసుగా ప్రవర్తించారని ఫిర్యాదు చేసింది. ఇక, సభలో టీడీపీ సభ్యుల తీరు పైన ప్రభుత్వం అసహనంతో ఉంది. దీంతో..మొత్తం వ్యవహారం పైన గవర్నర్ వారిద్దరితో చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం.
సభల్లో పరిణామాలపై గవర్నర్ ఆరా..
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్ తాజా నిర్ణయం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు కారణమైంది. ఏపీ ప్రభుత్వం మూడు రాజధానులు..సీఆర్డీఏ రద్దు బిల్లులను శాసనసభలో ప్రవేశ పెట్టి ఆమోదించా రు. ఆ తరువాతి రోజు అవే బిల్లులను మండలిలో ఆమోదం కోసం ప్రతిపాదించే సమయం నుండి బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపే వరకూ చోటు చేసుకున్న పరిణామాలు వివాదాస్పదమయ్యాయి.
రూల్ 71 కింద చర్చకు టీడీపీ పట్టు బట్టింది. ఆ చర్చ తరువాత బిల్లులపైన చర్చ జరిగింది. అయితే, ఈ బిల్లులను సెలెక్ట్ కమటీకి పంపాలని టీడీపీ డిమాండ్ చేయగా..సభలోని మంత్రులు..అధికార పక్ష నేతలు మాత్రం అంగీకరించలేదు. బిల్లులను ఆమోదించటం లేదా తిరస్కరించటం చేయాలని కోరారు. అయితే, సుదీర్ఘ వివరణ తరువాత ఛైర్మన్ తన విచక్షణాధికారం మేరకు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపిస్తున్నట్లుగా ప్రకటించారు. దీని పైన శాసనసభలో జరిగిన చర్చలో ముఖ్యమంత్రి ఛైర్మన్ తీరు పైన అభ్యంతరం వ్యక్తం చేసారు. అయితే, కొద్ది సేపటి క్రితం గవర్నర్ నేరుగా అసెంబ్లీ స్పీకర్ తో పాటుగా మండలి ఛైర్మన్ ను రాజ్ భవన్ కు పిలిపించారు. వారిద్దరితో చర్చలు చేసారు.
సభలో చర్చ..మండలి పరిణామాల పైన..
గవర్నర్ అటు అసెంబ్లీ స్పీకర్..ఇటు మండలి ఛైర్మన్ ను పిలిపించి పూర్తి సమాచారం సేకరించినట్లుగా తెలుస్తోంది. మండలిలో బిల్లు పైన నిర్ణయం సమయంలో మంత్రులు...వైసీపీ నేతలు వ్యవహరించిన తీరు పైన వీడియో ఫుటేజ్ ను పెన్ డ్రైవ్ ద్వారా టీడీపీ అదినేత గవర్నర్ కు అందించారు. అదే సమయంలో అసెంబ్లీలో మండలి గురించి అసెంబ్లీలో చర్చించటం..మండలి ఛైర్మన్ ప్రసంగాన్ని శాసనసభ లో ప్రదర్శించటం పైన టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఇక, మండలిలో మంత్రులు..వైసీపీ అభ్యర్ధులు ఛైర్మన్ పట్ల దురుసుగా వ్యవహరించారని..దూషించారంటూ టీడీపీ గవర్నర్ కు ఫిర్యాదు చేసారు. దీంతో.. ఈ రెండు సభల్లో ఏం జరిగింది. ఈ పరిణామాలు చోటు చేసుకోవటం ఏంటనే దాని పైన గవర్నర్ ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. రెండు సభల్లో జరుగుతున్న పరిణామాల పైన ఆరా తీయటంతో పాటుగా.. టీడీపీ ఫిర్యాదుల్లో వాస్తవాలను తెలుసుకొనే ప్రయత్నం చేసినట్లుగా విశ్వసనీయ సమాచారం. మండలి గ్యాలరీలోకి వైసీపీ నేతలు..టీడీపీ అధినేత రావటం పైనా ఆరా తీసినట్లుగా తెలుస్తోంది.
కేంద్రం సమాచారం కోరిందా..గవర్నర్ స్వతహాగానా..
ఏపీలో చోటు చేసుకుంటున్న పరిణామాల పైన కేంద్రం ఫోకస్ చేసిందని కొద్ది రోజులుగా బీజేపీ నేతలు చెబుతూ వస్తున్నారు. రాజధాని విషయంలో కేంద్రానికి సంబంధం లేక పోయినా..మొత్తం వ్యవహారం పైన గవర్నర్ ను ఆరా తీసిందా అనే చర్చ మొదలైంది. సాధారణంగా గవర్నర్లు తమ వద్దకు వచ్చే ఫిర్యాదులను స్వీకరించటం..ఇతర మార్గాల ద్వారా సమాచారం సేకరించటం.. కేంద్రానికి నివేదించటం సాధారణం గా జరిగే ప్రక్రియ.
అయితే, ఇప్పుడు ఈ వ్యవహారాల పైన గవర్నర్ నేరుగా అసెంబ్లీ స్పీకర్..మండలి ఛైర్మన్ ను పిలిపించటం..రెండు సభల్లో చోటు చేసుకున్న పరిణామాల పైన ఆరా తీయటం ద్వారా ఆయన కేంద్రానికి ఇక్కడ జరుగుతున్న పరిణామాల పైన నివేదించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు గవర్నర్ జోక్యంతో..ప్రభుత్వం రానున్న రెండు రోజుల్లో శాసన సభ..ప్రభుత్వ పరంగా తీసుకొనే నిర్ణయాలు కీలకంగా మారనున్నాయి.