పవన్! రాజీనామా చేస్తా, గాలి జనార్ధన్రెడ్డికి ఓకే కానీ: సీఎం రమేష్ షరతు, ఆరోగ్యంపై గవర్నర్ ఆరా
కడప: కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం ఆందోళనలు ఉధృతమవుతున్న నేపథ్యంలో కర్ణాటక నేత గాలి జనార్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. తాను కడపలో స్టీల్ ప్లాంట్ కడతానని, లేదంటే తన డబ్బులు తనకు ఇవ్వాలని చెప్పారు. దీనిపై స్టీల్ ప్లాంట్ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సీఎం రమేష్ స్పందించారు.
Recommended Video
తనపై ఉన్న సీబీఐ కేసుల నుంచి గాలి బయటపడి, కడప ప్రాంతంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం తలపెడితే ఆయనకు మద్దతిస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఛానల్తో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంటు ఏర్పాటై ఉంటే తాము ఇలా దీక్షలకు దిగేవాళ్లమే కాదన్నారు. బ్రహ్మణి స్టీల్ ఫ్యాక్టరీ కోసం రూ.1,200 కోట్లు బ్యాంకు రుణం తీసుకుని రూ. 50 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదన్నారు. తొలుత ఆయన కేసుల నుంచి బయటకు రావాలని, ఆ తర్వాత ఫ్యాక్టరీ పనులు ప్రారంభిస్తే ఎవరికీ అభ్యంతరాలు ఉండవన్నారు.
పవన్ కళ్యాణ్! నేను రాజీనామా చేస్తా
ప్రజల నుంచి మద్దతు వస్తుందన్న అసూయతోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేస్తున్నారని సీఎం రమేష్ మండిపడ్డారు. తప్పుడు ఆరోపణలు చేయడం ఆయనకు తగదన్నారు. తమ దీక్షకు మద్దతివ్వకుండా ఆరోపణలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. జిందాల్ను పవన్ ఎప్పుడు కలిశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన చెప్పిన విషయాల్ని అప్పుడే ఎందుకు బహిర్గతం చేయలేదన్నారు. జిందాల్ లండన్లో ఉండటం లేదని, ఇండియాలోనే ఉంటున్నారని, ఆ విషయం కూడా తెలియని పవన్, ఆయన పేరిట తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నారన్నారు. స్టీల్ ఫ్యాక్టరీని టీడీపీ నేతలు అడ్డుకున్నారని నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని సవాల్ చేశారు.
బీజేపీ, వైసీపీలు అడ్డుపడుతున్నాయి
కడప ఉక్కు పరిశ్రమకు బీజేపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు అడ్డుపడుతున్నాయని మంత్రి అమర్నాథ్ రెడ్డి సోమవారం అన్నారు. స్టీల్ ఫ్యాక్టరీని గాలి జనార్ధన్ రెడ్డికి అప్పగించేందుకు సిద్ధమయ్యారని మండిపడ్డారు. ఉద్దేశ్యపూర్వకంగానే ఏపీకి అన్యాయం చేస్తున్నారని గాలి మాటల్లో తేలిపోయిందన్నారు. మరో మంత్రి ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలనే అంశం విభజన చట్టంలో ఉందని చెప్పారు. బీజేపీ, వైసీపీలు డ్రామాలు ఆడుతున్నాయన్నారు. కడప జిల్లాలో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నో సంస్థలు సిద్ధంగా ఉన్నాయన్నారు. గాలి జనార్ధన్ రెడ్డే కాదని.. జిందాల్, టాటా వంటి కంపెనీలు కూడా సిద్ధంగా ఉన్నాయని ఆయన చెప్పారు. స్టీల్ ప్లాంటు ఏర్పాటుకు కడపలో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయని చెప్పారు.
జగన్, పవన్ నోరు పెగలడం లేదు
ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని వైసీపీ, బీజేపీలు ఢిల్లీలో తాకట్టు పెట్టాయని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. ఏపీ అభివృద్ధిని కలియుగ సైంధవుల్లా అడ్డుకుంటున్నారన్నారు. వైసీపీ కపట నాటకాలు ఆడుతుంటే, బీజేపీ మాయమాటలు చెబుతోందన్నారు. సొంతగడ్డకు అన్యాయం జరుగుతుంటే జగన్ కళ్లప్పగించి చూస్తున్నారని, విజయ సాయి రెడ్డిని మోడీ ఇంట్లో పెట్టారని విమర్శించారు. కేంద్రం అభివృద్ధిని అడ్డుకుంటుంటే జగన్, పవన్ కళ్యాణ్ల నోరు పెగలడం లేదన్నారు. బళ్లారిలో గాలి జనార్ధన్ రెడ్డికి, కడపలో జగన్కు లబ్ధి చేకూర్చేందుకు బీజేపీ కడపకు స్టీల్ ప్లాంట్ రాకుండా అడ్డుకుంటోందన్నారు. ఢిల్లీలో కదలిక తెచ్చేలా సీఎం రమేష్ దీక్ష చేస్తున్నారన్నారు. జగన్ ప్రధాని మోడీ పేరు ఎత్తాలంటే భయపడుతున్నారన్నారు.
రాజీనామా పేరుతో డ్రామాలు
ఐదుగురు ఎంపీలతో వైసీపీ రాజీనామా డ్రామాలు ఆడించిందని టీడీపీ నేతలు మండిపడ్డారు. కానీ అవిశ్వాస తీర్మానం సమయంలో టీడీపీ పిలుపుతో వందమంది ఎంపీలు మద్దతిచ్చారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కుల సాధనకు స్వాతంత్ర్య పోరాటాన్ని తలపించేలా కేంద్రంపై పోరాటం చేయాలని ప్రముఖ దర్శకులు రాఘవేంద్ర రావు అన్నారు. ఉక్కు పరిశ్రమ కోసం దీక్ష చేస్తున్న సీఎం రమేష్కు మంత్రులు చినరాజప్ప, పత్తిపాటి పుల్లారావు, కాల్వ శ్రీనివాసులు, గంటా శ్రీనివాస్, సినీ దర్శకులు రాఘవేంద్ర రావు తదితరులు ఆదివారం మద్దతు తెలిపారు.
వారి ఆరోగ్యంపై గవర్నర్ ఆరా
ఇదిలా ఉండగా, సీఎం రమేష్ దీక్షపై గవర్నర్ నరసింహన్ ఆరా తీశారు. ఈ మేరకు ఆయన సీఎం చంద్రబాబుకు సోమవారం ఫోన్ చేశారు. ఆరోగ్యం చూసుకోవాలని సూచించారు. కాగా, సీఎం రమేష్, బీటెక్ రవిలను సోమవారం వైద్యులు పరీక్షించారు. దీక్ష విరమించాలని వారికి సూచించారు. వారికి షుగర్ లెవల్స్ బాగా తగ్గాయని, బరువు తగ్గుతున్నారని చెప్పారు. ఇద్దరు నీరసంగా ఉన్నారని చెప్పారు. ఉన్నతాధికారులకు వెంటనే నివేదిక పంపించనున్నట్లు తెలిపారు.