విజయ్ బూబూజీ బాగున్నారా?: ఏపీ వ్యక్తితో మోడీ తెలుగులో, ‘పీఎంబీజేపీ’ లేకుంటే బతికేవాళ్లం కాదు’
న్యూఢిల్లీ: దేశంలోని పేద ప్రజలందరికీ అన్ని రకాల వైద్య సదుపాయాలను అందుబాటులో తీసుకురావడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. 'ప్రధానమంత్రి భారతీయ జనౌషధి ప్రయోజన(పీఎంబీజేపీ)' పథకం లబ్ధిదారులతో ప్రధాని మోడీ గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ పథకం ద్వారా వారు ఎలా లబ్ధిపొందారు? వారి ఆరోగ్య పరిస్థితిని మోడీ అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విజయ్ బాబు అనే లబ్ధిదారుడితో ప్రధాని మోడీ తెలుగులో పలకరించడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్కు చెందిన విజయ్ బాబు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. తొలుత ప్రైవేటు ఆసుపత్రిలో డయాలసిస్ చేయించుకున్న ఆయన ఆ తర్వాత పీఎంబీజేపీ పథకం కింద డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గురువారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో విజయ్ బాబు పాల్గొని ప్రధాని మోడీతో మాట్లాడారు.
'విజయ్ బాబుజీ.. ఎలా ఉన్నారు? బాగున్నారా?' అని మోడీ తెలుగులో అడిగారు. ఆ తర్వాత విజయ్ బాబు మాట్లాడుతూ.. తాను మూడేళ్ల నుంచి డయాలసిస్ చేయించుకుంటున్నట్లు చెప్పారు. 'ఏడాది పాటు ప్రైవేటు ఆసుపత్రిలో డయాలసిస్ చేయించుకుంటే చాలా ఖర్చయ్యింది. ఆ తర్వాతి నుంచి పీఎంబీజేపీ పథకం కింద ప్రభుత్వ ఆసుపత్రిలో చూపించుకుంటున్నాను. ఇప్పుడు ట్రీట్మెంట్ బాగుంది' అని చెప్పారు.
ఇందుకు ఖర్చేమైనా అవుతుందా? అని మోడీ ప్రశ్నించగా.. ఎలాంటి ఖర్చు అవట్లేదని, కేవలం మందులు మాత్రమే కొనుక్కుంటున్నానని చెప్పారు. ఆ మందులు కూడా జనౌషధి కేంద్రాల నుంచే తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ పథకం తీసుకురాకపోతే తనలాంటి బడుగు, బలహీన వర్గాల వారు చనిపోయేవారని విజయ్ బాబు అన్నారు. ఆ తర్వాత మోడీ మాట్లాడుతూ.. 'ఈ పథకం ద్వారా మిగులుతున్న డబ్బులను మంచిగా వాడుకోండి. పిల్లలు, అమ్మాయిల చదువులకు ఉపయోగించండి. చేస్తారు కదా?' అని మోడీ అడిగారు. అవునన్నట్లుగా విజయ్ బాబు నవ్వారు.
కాగా, పేద ప్రజలకు అందుబాటు ధరల్లో మెరుగైన వైద్యాన్ని అందించేందుకు 2016 నవంబరులో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి భారతీయ జనౌషధి ప్రయోజన పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద తక్కువ ధరకే మోకాళ్ల మార్పిడి, గుండె స్టెంట్లు, డయాలసిస్ వంటి చికిత్స అందిస్తోంది. దీంతో పాటు దేశవ్యాప్తంగా జనౌషధి కేంద్రాలను కూడా ఏర్పాటుచేశారు. వీటిలో 600లకు పైగా మందులు, 154 శస్త్రచికిత్స పరికరాలు తక్కువ ధరకే అందిస్తున్నారు. పథకంలో అమల్లోకి వచ్చి రెండున్నరేళ్లు దాటిన సందర్భంగా మోడీ లభ్ధిదారులతో మాట్లాడారు.