ఆర్డినెన్స్ తెస్తారా.. రాజధానిపై ముందుకే: న్యాయ పరంగానూ చిక్కులే: ప్రభుత్వం ఏం చేయబోతోంది..!
ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లులకు మండలి బ్రేక్ వేసింది. మండలిలో తిరస్కరించినా...తిరిగి శాసనసభలో బిల్లులు ప్రవేశించి..తమకున్న అధికారం ద్వారా బిల్లును ఆమోదించుకోవాలని ప్రభుత్వం భావి స్తూ వచ్చింది. దీనికి అనుగుణంగా.. మండలిలో పరిణామాల కారణంగా..చివరి నిమిషం వరకు ఎదురు చూసి..బుధవారం ముగియాల్సిన శాసనసభను ఈ రోజు పొడిగించారు. అయితే, అనూహ్యంగా బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపిస్తూ ఛైర్మన్ నిర్ణయించారు. దీంతో..ఈ రోజు శాసనసభలో ఏం జరగబోతోంది. కీలక నిర్ణయాల దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందా. మరి..ఈ బిల్లుల విషయంలో ప్రభుత్వం ముందున్న ప్రత్యామ్నాయ మార్గాలేంటి..మండలి ఛైర్మన్ నిర్ణయం తరువాత తలెత్తుతున్న సందేహాలివి. దీంతో..ఈ రోజు ప్రభుత్వం కీలక చర్చలు..నిర్ణయాలు చేసే అవకాశం కనిపిస్తోంది.
ఆర్డినెన్స్ తీసుకొస్తుందా...
మూడు రాజధానుల బిల్లు..సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపిస్తూ మండలి ఛైర్మన్ నిర్ణయించారు. దీంతో..ప్రభుత్వం ఇప్పుడు ఏ రకంగా ముందడుగు వేస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది. దీని పైన ప్రభుత్వం తమ ముందున్న మార్గాలు..అనుసరించాల్సిన వ్యూహాల పైన కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష టీడీపీ సైతం ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉందనే దాని పై అంచనాలు మొదలు పెట్టింది. ఇప్పుడు మండలి ఛైర్మన్ సెలెక్ట్ కమిటీకి బిల్లులు పంపటంతో..అవి దాదాపు మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో..అప్పటి వరకు వేచి చూడకుండా ముందుకే వెళ్లాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా.. ఆర్డినెన్స్ తేవటం లేదా..మళ్లీ బిల్లు పెట్టటం వంటి వాటి పైన ప్రస్తుతం ఆసక్తి చర చర్చ సాగుతోంది. అయితే, ప్రభుత్వం శాసనసభ లో మూడు బిల్లుల ఆమోదం సమయంలోనే తీర్మానం సైతం చేసింది. ఇప్పుడు అది తెర మీదకు వచ్చే అవకాశం ఉంది.
ఆర్డినెన్స్ తేవాలంటే...అమలవుతుందా..
ప్రభుత్వం సెలెక్ట్ కమిటీ నిర్ణయం వచ్చే వరకు నిరీక్షించే పరిస్థితి కనిపించటం లేదు. దీంతో..ఆర్డినెన్స్ దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందా అనే చర్చ మొదలైంది. ఆర్డినెన్సు జారీ చేయడానికి ముందు... చట్టసభల్ని ప్రొరోగ్ చేయాలి. ఆ తర్వాత గవర్నరు ఆమోదంతో ఆర్డినెన్సు జారీ చేయాలి. అది ఆరు నెలలపాటు అమల్లో ఉంటుంది. ఆ లోగా మళ్లీ చట్టసభల్లో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం పొందాలి. లేకపోతే 6 నెలల తర్వాత మళ్లీ ఆర్డినెన్సు గడువును పొడిగించవచ్చు. లేదా మొత్తంగా మండలినే రద్దు చేయాలన్న నిర్ణయమూ తీసుకోవచ్చు.దీనికి సుదీర్ఘ ప్రక్రియ ఉంటుంది. మండలిని రద్దు చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరుతూ మంత్రి మండలి తీర్మానం చేయాలి. దానిని శాసనసభ ఆమోదంతో కేంద్రానికి పంపించాలి. రాష్ట్ర ప్రభుత్వ తీర్మానాన్ని కేంద్రం ఆమోదిస్తే పార్లమెంటులో బిల్లు పెట్టి చట్టం చేస్తుంది. కేంద్ర చట్టం ద్వారా మాత్రమే శాసన మండలిని రద్దు చేయగలరు. ఈ ప్రక్రియంతా ముగిసే సరికి కనీసం ఏడాది సమయం పడుతుందని చెబుతున్నారు.
న్యాయ పరమైన చిక్కులు సైతం..
ఇదే సమయంలో ప్రభుత్వం ఆర్డినెన్స్ తేవాలన్నా.. సాంకేతికంగా..న్యాయ పరంగా చిక్కులు పొంచి ఉన్నాయి. ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లులకు తోడుగా తీర్మానం సైతం ఆమోదించింది. ఆ తీర్మానం మేరకు తొలుత కార్యాలయాల తరలింపు ప్రారంభించాలనేది ప్రభుత్వ ఆలోచన. అయితే, ఇప్పటికే తరలింపును అడ్డుకోవాలంటూ హైకోర్టులో రాజధాని రైతులు వేసిన పిటీషన్ విచారణలో ఉంది. దీని పైన ఈ రోజు నిర్ణయం వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక, ఇదే సమయంలో ఆర్డినెన్స తెచ్చే అధికారం ఉన్నా..మండలిలో బిల్లు సెలెక్ట్ కమిటీకి పంపిన ఈ సమయంలో గవర్నర్ ఆర్డినెన్స్ కు ఎంత వరకు ఆమోద ముద్ర వేస్తారు.. న్యాయ సమీక్షకు వెళ్తే నిలుస్తుందా అనే చర్చ సైతం ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తోంది. దీంతో..ప్రభుత్వం ఇప్పుడు వేసే ప్రతీ అడుగు కీలకంగా మారనుంది. ఈ రోజు శాసనసభా వేదికగా ప్రభుత్వం ఏమైనా దీని పైన స్పష్టత ఇస్తుందా..లేక వేచి చూసే ధోరణితో ఉంటుందా అనేది చూడాలి.