ఏపీలో కొత్తగా 60 కార్పొరేషన్లు: బీసీలకు 57.. ఈబీసీలకు 3: కమ్మ..రెడ్డి వర్గాలకు సైతం..!
ఏపీలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా అనేక వర్గాల కోసం ప్రత్యేకంగా కార్పోరేషన్లు ఏర్పాటుకు రంగం సిద్దమైంది. ముఖ్యమంత్రి జగన్ ఈ మేరకు అధికారులకు దిశా నిర్ధేశం చేసారు. అందులో భాగంగా.. ఇప్పటికే ఉన్న 30 కార్పోరేషన్లను అదనంగా కొత్తగా 60 కార్పోరేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్దమయ్యాయి. అందులో బీసీలకు 57, ఈబీసీలకు 3 కార్పొ రేషన్లు ఉన్నాయి. బీసీల్లో ప్రతి కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారిని ఆర్థికంగా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. బీసీ సంక్షేమ శాఖ ప్లాన్ ఏ కింద 16, ప్లాన్ బీ కింద మరో 41 కార్పొరేషన్ల ఏర్పా టుకు ప్రతిపాదనలు రూపొందించింది. వీటితో పాటుగా అగ్ర వర్గాలకు చెందిన సామాజిక వర్గాలకు గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రత్యేకంగా కార్పోరేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ముఖ్యమంత్రి జగన్ తో త్వరలో బీసీ సంక్షేమ శాఖ సమీక్ష జరగాల్సి ఉంది అందులో కొత్త కార్పొరేషన్ల ఏర్పాటుకు ఆమోదం లభిస్తుందని అధికారులు చెబుతున్నారు. బీసీ-ఏ గ్రూపులో ఆదిమ తెగలు, విముక్తి జాతులు, సంచార, సెమీ సంచార జాతుల వారు, బీసీ-బీ గ్రూపులో వృత్తిపరమైన పనులు చేసుకునే, బీసీ-సీ గ్రూపులో క్రైస్తవ మతంలోకి మారిన వారు, బీసీ-డీ గ్రూపులో ఇతర బీసీ కులాల వారు, బీసీ-ఈ గ్రూపులో ముస్లింలలో వెనుకబడిన కులాలున్నాయి.
కాగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 30 కార్పొరేషన్లు ఉండగా.. ఇందులో ఈబీసీలకు (కాపు, ఈబీసీ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ) కార్పొరేషన్లు ఉన్నాయి. దేవదాయ శాఖ పరిధిలో ఉన్న బ్రాహ్మణ కార్పొరేషన్ మినహా యించి మిగిలిన ఈబీసీల కార్పొరేషన్లు బీసీ సంక్షేమ శాఖ పరిధిలోకే వస్తాయి. ఇక, కొత్తగా ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నవి కాకుండా.. కమ్మ, రెడ్డి, క్షత్రియులకు ప్రత్యేకంగా ఒక్కొక్క కార్పొరేషన్ ప్రతిపాదించారు. వీటి ద్వారా ఆ వర్గాలకు చెందిన వారికి రుణాలు..సబ్సిడీలు.. పధకాలు ప్రత్యేకంగా అమలు చేయనున్నారు. ప్రతీ కార్పోరేషన్ కు నిధుల కేటాయింపు అంశం పైన ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది.