డిజిపి-చినరాజప్ప హెచ్చరిక, పోలీసుల వ్యూహాలపై ముద్రగడ పైఎత్తు
కాపు నేత ముద్రగడ పద్మనాభంపై మంత్రి చినరాజప్ప, టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వర రావులు మంగళవారం నిప్పులు చెరిగారు.
కిర్లంపూడి: కాపు నేత ముద్రగడ పద్మనాభంపై మంత్రి చినరాజప్ప, టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వర రావులు మంగళవారం నిప్పులు చెరిగారు. ముద్రగడ తన ఉనికి కాపాడుకునేందుకు మూడు నెలలకు ఓసారి డ్రామా చేస్తున్నారని చినరాజప్ప అన్నారు.
ముద్రగడ పాదయాత్ర: అనుమతి లేదు, అతిక్రమిస్తే చర్యలు
పాదయాత్రకు అనుమతి ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అనుమతి కోరితే ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు. ముద్రగడ వెనుక వైసిపి తప్ప కాపులు లేరని ఎద్దేవా చేశారు. జగన్ ఆడుతున్న నాటకంలో ముద్రగడ పాత్రధారి అన్నారు.
ముద్రగడ ఆందోళనకు అనుమతి లేదు: ఉమ
ముద్రగడ పాదయాత్రకు అనుమతి లేదని, రాజకీయ కారణాలతోనే ఆందోళనలు అని బోండా ఉమ అన్నారు. యువత పాదయాత్రలో పాల్గొనవద్దన్నారు. కాపు సంఘాలు, యువత ముద్రగడ, జగన్ వలలో పడవద్దన్నారు. మంజునాథ కమిషన్ నివేదిక అందాక న్యాయపరమైన చిక్కులు లేకుండా కాపులను బీసీల్లో చేర్చుతామని చెప్పారు. కాపులకు ఇచ్చిన హామీలను విడతల వారీగా అమలు చేస్తామని చెప్పారు.
ప్రభుత్వం ఆస్తులు ఎలా కాపాడుకోవాలో తెలుసు
ప్రభుత్వం ఆస్తులు ఎలా కాపాడుకోవాలో తమకు తెలుసునని డిజిపి సాంబశివ రావు అన్నారు. గత ఏడాది ముద్రగడ ఆందోళన వల్ల ప్రభుత్వానికి రూ.70 కోట్ల ఆస్తి నష్టం జరిగిందని చెప్పారు. పాదయాత్ర అంటు వితండంగా ముందుకు వెళ్తే పర్యావసనాలు తీవ్రంగా ఉంటాయన్నారు. పాదయాత్రకు అనుమతి లేదని, పాల్గొంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. తాము ఏ నాయకుడికీ వ్యతిరేకం కాదని, ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే వ్యతిరేకమన్నారు.
ముద్రగడ ఇంటి చుట్టూ పోలీసులు
ముద్రగడ బుధవారం నుంచి తలపెట్టిన నిరవధిక పాదయాత్ర నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లా వ్యాప్తంగా భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. ముద్రగడ నివాసం వద్ద రెండువేల మందికి పైగా పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఉంది.
పోలీసుల వ్యూహాలకు చెక్ చెప్పేలా
పోలీసుల కదలికలను ఎప్పటికి అప్పుడు తెలుసుకునేలా ముద్రగడ తన ఏర్పాట్లు చేసుకున్నారు. పోలీసుల వ్యూహాలకు పైఎత్తు వేసి, రేపు పాదయాత్ర చేపట్టాలని భావిస్తున్నారు. ఈ మేరకు హైడెఫినేషన్ వర్చువల్ రియాల్టీ సామర్థ్యం కలిగిన సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు. పోలీసులు కనుక హింసాత్మక చర్యలకు పాల్పడితే ఆ దృశ్యాలను రికార్డు చేసే నిమిత్తం వీటిని ఏర్పాటు చేశారని తెలుస్తోంది. అలాగే, వారి కదలికలను బట్టి ఎలా ముందుకెళ్లాలో నిర్ణయించుకోనున్నారు.