కరోనాతో మృతి చెందిన వైద్యుల కుటుంబాలకు 30 రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం .. సీఎం జగన్ నిర్ణయం
కరోనా కష్టకాలంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా సేవలందిస్తున్న వైద్యుల విషయంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో, కరోనా బారిన పడిన వ్యక్తికి సొంతవారే దూరంగా ఉంటున్న పరిస్థితులున్నాయి . అటువంటివారికి వైద్య సేవలు అందిస్తూ చాలామంది వైద్యులు తమ ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. కరోనా క్లిష్ట సమయంలోనూ విధులు నిర్వర్తిస్తూ కరోనా బారిన పడి మృతి చెందుతున్న వైద్యులు ఉన్నారు. వైద్యులు కుటుంబాల్లో కరోనా తీవ్ర విషాదాన్ని నింపుతోంది .
Recommended Video
కరోనా మహమ్మారికి బలైపోయిన వైద్యుల కోసం ఏపీ ప్రభుత్వ నిర్ణయం
కుటుంబానికి ఆధారంగా ఉన్న వారిని పోగొట్టుకుని వైద్యుల కుటుంబ సభ్యులు కంటికి కడివెడు దుఃఖంలో ఉన్నారు . రాష్ట్రంలో కరోనా వైరస్ తో అత్యవసర పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వైద్యుల పాత్ర కీలకం కావడంతో వైద్యులు విధులు కచ్చితంగా చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అయితే చాలా మంది వైద్యులు కరోనా మహమ్మారి బారిన పడి బలైపోయారు. అటువంటి వైద్యుల కుటుంబాలకు అండగా ఉండడం కోసం సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.
కుటుంబంలో ఒకరికి 30 రోజుల్లోగా ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇచ్చేలా ఆదేశాలు
కరోనా విధుల్లో భాగంగా సేవలందిస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు ఎవరైనా కరోనా వైరస్ తో మృతి చెందితే వారి కుటుంబాలను సాధ్యమైనంత తొందరగా ఆదుకోవాలని నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కార్. ఈ క్రమంలోనే వారి కుటుంబంలో ఒకరికి 30 రోజుల్లోగా ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇచ్చేలా ఉత్తర్వులిచ్చారు. ఇందుకు సంబంధించి ఏపీ వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ, ఆసుపత్రుల్లో పనిచేస్తూ కరోనా బారిన పడి మృతి చెందిన వైద్యులకు సంబంధించిన వివరాలను పంపించాలని అన్ని జిల్లాలకు సంబంధించిన డిఎంహెచ్వో లకు, డి సి హెచ్ ఎస్ లకు, బోధనాసుపత్రిలో పనిచేసే సిబ్బంది గురించి సూపరిండెంట్ కు ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా వివరాలు పంపించాలని ఆదేశం .. వైద్యుల కుటుంబాలకు అండగా
మృతుల వివరాలు వచ్చిన వెంటనే వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, ఈ ప్రక్రియ కూడా 30 రోజుల్లోనే పూర్తి చేయాలని , మృతి చెందిన వైద్యులు కుటుంబాలకు అండగా ఉండాలని ఆదేశించింది ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనాకేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో,వివిధ ఆసుపత్రుల్లో పరిస్థితిని తెలుసుకొని తదనుగుణంగా చర్యలను తీసుకుంటుంది. కరోనావైరస్ కారణంగా మృతి చెందిన వైద్యుల స్థానంలో కొత్త వారిని నియమించడం చేస్తున్న ప్రభుత్వం ఈ సమయంలో ప్రజల ప్రాణ రక్షణకు తమ ప్రాణాలను త్యాగం చేసిన వైద్యుల కుటుంబాలను ఆదుకునే బాధ్యత తీసుకుంది .
కరోనా కట్టడి కోసం ప్రభుత్వ చర్యలు ..30,887 మంది తాత్కాలిక నియామకం
ఒకపక్క కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించడం కోసం నిత్యం సమీక్షలు చేస్తూ, చర్యలు తీసుకుంటున్న సీఎం జగన్ అటు ఆస్పత్రిలో బెడ్ ల సంఖ్యను పెంచడమే కాకుండా అవసరమైన డాక్టర్లను, వైద్య సిబ్బందిని నియమించడం కోసం కూడా తగిన చర్యలు తీసుకుంటున్నారు. తాత్కాలిక ప్రాతిపదికన వారినినియమించాలని నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ చికిత్సతో పాటు సంబంధిత కోవిడ్ నియంత్రణకు ముందస్తు చర్యల్లో భాగంగా 30,887 మందిని నియమించడం కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది.