పులిచింతల ప్రాజెక్టు వద్ద వైఎస్సార్ విగ్రహం: 45 అడుగుల ఎత్తుతో: పర్యాటక ప్రాంతంగా..!
ఏపీలో పులిచింతల ప్రాజెక్టు వద్ద దివంగత ముఖ్యమంత్రి వైయస్సార్ విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి స్థల పరిశీలన..విగ్రహం ఏర్పాటు అంశాల పర్యవేక్షణ బాధ్యత లను ముఖ్యమంత్రి జగన్ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్ తో పాటుగా పేర్ని నానికి అప్పగించారు. దీంతో..వారిద్దరూ పులిచింతల వద్ద స్థలం అదే విధంగా పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ప్రాజెక్టు నిర్మించిన తర్వాత మొట్టమొదటి సారిగా పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేయడం తో మంత్రులు అక్కడ పులిచింతల జల హారతి నిర్వహించారు.
కార్యక్రమంలో భాగంగా మంత్రులు కృష్ణమ్మకు పసుపు, కుంకుమ, చీరె, సారెలను సమర్పించారు. అనంతరం పులిచింతల ప్రాజెక్టును మంత్రులు పరిశీలించారు. పులిచింతల ప్రాజెక్టు వద్ద దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర నీటి పారుదల శాఖమంత్రి అనిల్కుమార్ యాదవ్ ప్రకటించారు.
వైయస్సార్ హాయంలో రూపు దిద్దుకున్న ఈ ప్రాజెక్టు ద్వారా కలిగే ప్రయోజనాలను మంత్రి వివరించారు. నాడు తండ్రి నిర్మించిన ప్రాజెక్టులో ఇప్పుడు తనయుడి హాయంలో తొలి సారిగా నిండుకుండలా మారిందని సంతోషం వ్యక్తం చేసారు. ఈ ప్రాజెక్టు వద్ద సుమారు 45 అడుగుల వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలోనే వైఎస్సార్ స్మృతి వనం, పార్కును నిర్మిస్తామని తెలిపారు. వైఎస్సార్ విగ్రహంతో పాటు డా. కెఎల్ రావు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. పులిచింతల ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.
రోడ్లు, భవనాలతోపాటు, నాలుగు కిలోమీటర్ల పాటు దిగువన ఉన్న గుంటూరు, కృష్ణా జిల్లాలను కలుపుతూ వారధి నిర్మిస్తామని మంత్రి ప్రకటించారు. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకే ప్రాజెక్టు వద్ద స్థలాన్ని పరిశీలించినట్టు వెల్లడించారు. మరో ఇరవై ఏళ్ల పాటు రాష్ట్రంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని మంత్రులు ధీమా వ్యక్తం చేసారు. వచ్చే జూలై 8 నాటికి వైయస్సార్ జన్మదినం సందర్భంగా ఈ విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీని పైన వచ్చే కేబినెట్ సమావేశంలో అధికారికంగా ఆమోద ముద్ర వేయనున్నారు.