పరవాడ ప్రమాద మృతుడికి కంపెనీ, ప్రభుత్వం సాయం, కుటుంబానికి రూ.50 లక్షలు...
విశాఖపట్టణం పరవాడ ఫార్మాసిటీలో మృతిచెందిన సీనియర్ కెమిస్ట్ శ్రీనివాసరావు కుటుంబానికి కంపెనీ, ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. సాల్వెంట్స్ కంపెనీ రూ.35 లక్షల పరిహారం ప్రకటించగా, ప్రభుత్వం రూ.15 లక్షలు అందజేస్తామని తెలియజేసింది. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి నగదు అందజేస్తామని సీఎంవో ఒక ప్రకటనలో తెలిపింది. ప్రమాదంలో గాయపడ్డ ఒక్కొక్కరీకి రూ.20 లక్షల పరిహారం ఇస్తామని వెల్లడించారు. ప్రమాదంలో ముగ్గురికి స్వల్ప గాయాలైన సంగతి తెలిసిందే. తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మల్లేష్కు మెరుగై వైద్యం అందజేయాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు.
పరవాడ ఫార్మాసిటీ ప్రమాదంపై లోకేశ్ దిగ్బ్రాంతి, ఆళ్లనాని, సుచరిత కూడా.. 15 రోజుల్లో రెండో ప్రమాదం
విశాఖపట్టణం పరవాడలో గల రాంకీ ఫార్మాసిటీ సాల్వెంట్స్ కంపెనీలో సోమవారం అర్ధరాత్రి ప్రమాదం జరిగింది. పేలుళ్లతో ఆ ప్రాంతం భీతిల్లిపోయింది. మంటలు 50 అడుగుల వరకు ఎగిసిపడ్డాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మంటలు ఎగిసిపడ్డ ప్రదేశంలో 17 సార్లు పేలుడు శబ్దాలు వినిపించాయని స్థానికులు చెప్పారు. ప్రమాద స్థలికి అనకాపల్లి పరిధి నుంచి 12 ఫైరింజన్లు చేరుకొని.. మంటలను ఆర్పివేశాయి.
Recommended Video
సాల్వెంట్ రికవరీ కాలమ్లో ఉన్న రసాయనాల డ్రమ్ములకు కూడా మంటలు వ్యాపించడంతో భారీ శబ్దాలతో అవి పేలిపోయాయి. ఆ శబ్ధాల ధాటికి స్థానికులు గజ గజ వణికిపోయారు. ఆ శబ్దం సుమారు 10 కిలోమీటర్ల దూరం వరకు వినిపించాయని పరిసర ప్రజలు చెప్పారు. మంటలు కూడా 50 అడుగుల ఎత్తువరకు ఎగజిమ్మడంతో స్థానికులు బెంబేలెత్తిపోయారు.