ఆర్టీసి సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా: మూహుర్తం ఖరారు: ఎలక్ట్రికల్ బస్సుల పైనా..!
ఎంతో కాలంగా ఆర్టీసి సిబ్బంది ఎదురు చూస్తున్న విధంగా ఆ సంస్థ నూతన ఎండీ ప్రకటన చేసారు. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఆర్టీసిని తాము అధికారంలోకి వస్తే ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చారు. దానికి అనుగుణంగానే కమిటీ వేయటం..నివేదిక ఇవ్వటం జరిగింది. అయితే..సాంకేతిక అంశాల కారణంగా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయటానికి ఇబ్బందులు ఉన్నాయి. దీంతో..తొలుత ఆర్టీసీలోని సిబ్బందిని ప్రభుత్వ రవాణా శాఖ ఉద్యోగులుగా గుర్తించాలని నిర్ణయించారు. ఇది ఎప్పటి నుండి అమలు చేస్తారనే విషయం పైన తాజాగా ఆర్టీసీ ఇంఛార్జ్ ఎండీ కృష్ణబాబు వెల్లడించారు. ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయటం ద్వారా ఆర్టీసి పైన భారం తగ్గుందన్నారు. అదే విధంగా ఎలక్ట్రికల్ బస్సుల మీద అనవసరమైన ఆరోపణలు అక్కర్లేదని సూచించారు.
జనవరి 1 నుండి వారంతా ప్రభుత్వంలోకి..
ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఇచ్చిన హమీ మేరకు జగన్ అధికారంలోకి రాగానే తొలి కేబినెట్ సమావేశంలోనే ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం కోసం కమిటీ ఏర్పాటు చేసారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆంజనేయరెడ్డి కమిటీ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రికి నివేదిక అందించారు. అందులో సాంకేతిక కారణాల వలన సంస్థను వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయటం సాధ్యం కాదని..ఉద్యోగులను మాత్రం ప్రభుత్వంలో విలీనం చేసుకోవచ్చని సూచించారు.
దీంతో..ఆర్టీసి సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రభుత్వం కసరత్తు చేసిన తవరువాత దీని పైన సూత్ర ప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చింది. అందులో భాగంగా ఆర్టీసి సిబ్బంది వచ్చే జనవర్ 1వ తేదీ నుండి ప్రభుత్వ ఉద్యోగులుగా విలీనం అవుతారని సంస్థ ఇంఛార్జ్ ఎండీ కృష్ణబాబు తెలిపారు. ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగుల విలీన ప్రక్రియ జనవరి 1కి పూర్తయ్యేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.
సంస్థకు 3500 కోట్ల మిగులు..
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తే రూ.3300 కోట్లు ఆర్టీసీకి మిగులుతుందని ఆర్టీసీ ఇంఛార్జ్ ఎండీ కృష్ణబాబు తెలిపారు. ఆర్టీసీకి నెలకు 100 కోట్లు నష్టం వస్తుందన్నారు. 2015 నుండి డీజిల్, జీతభత్యాలు పెరగడం వల్ల నష్టాలు వస్తున్నాయని వివరించారు. అందుకోసమే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఉద్యోగులను విలీనం చేస్తే 3300 కోట్లు ఆర్టీసీకి మిగులుతుందన్నారు. సంస్థ యధావిధిగా కొనసాగుతుందని..అందులో పని చేసే సిబ్బంది మాత్రమే ప్రభుత్వంలోని రవాణా శాఖ ఉద్యోగులుగా మారుతారని స్పష్టం చేసారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నడుచుకుంటామని..
ప్రభుత్వం ఉద్యోగుల వేతనాలు ప్రభుత్వ ఉద్యోగులతో ఇవ్వటం ద్వారా సంస్థకు అధికంగా ఆర్దిక ప్రయోజనం చేకూరుతుందని స్పష్టం చేసారు. అదే సమయంలో సిబ్బంది ప్రభుత్వంలో విలీనం అయిన తరువాత మరింత బాధ్యతగా పని చేయాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. ఆర్టీసీ ఎండీగా ఉన్న సురేంద్రబాబును బదిలీ చేసి ఆయన స్థానంలో రవాణా శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న కృష్ణబాబు ను ప్రభుత్వం ఆర్టీసీ ఇంఛార్జ్ ఎండీగా నియమించింది.
ఎలక్ట్రికల్ బస్సుల్లో అనుమానాలు అక్కర్లేదు..
ఆర్టీసిలో డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రికల్ బస్సులు తీసుకురావాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేశారు. డీజిల్ బస్సులకు కి.మీకి రూ.13 ఖర్చు అవుతుందన్నారు.. అదే ఎలక్ట్రికల్ బస్సులకైతే రూ.3లు మాత్రమే ఖర్చు అవుతుందని తెలిపారు. ప్రస్తుతానికి 350 బస్సులు కేంద్రం ఏపీకి మంజూరు చేసిందన్నారు. ప్రైవేటుగా మరో 650 బస్సులు హైయర్ చేయబోతున్నామన్నారు. ఇందులో అనవసరమైన ఆరోపణలు అక్కర్లేదని సూచించారు. వాటిలో డ్రైవర్లు మాత్రం వీరే ఉంటారన్నారు. ఎలక్ట్రికల్ బస్సులపై ఎక్స్ఫర్ట్స్ కమిటీతో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
మిగిలిన రాష్ట్రాల్లో రేట్స్ను బట్టి ఓపెన్ టెండర్స్కి వెళ్తామన్నారు. లీజ్ పద్ధతిలో తీసుకోవడానికి ఈ టెండర్స్ పెడుతున్నట్లు వెల్లడించారు. 12 సంవత్సరాలకు లీజుకు తీసుకుంటామన్నారు. విశాఖ, కాకినాడ, విజయవాడ, గుంటూరు, తిరుపతి రూట్స్లో ఈ బస్సులు తిరగబోతున్నాయన్నారు. ఈ ఏడాది 1000 ఎలక్ట్రికల్ బస్సులు తీసుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు. బాగా రన్ అయితే మరిన్ని ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొస్తామని ఆర్టీసీ ఇంఛార్జ్ ఎండీ కృష్ణబాబు చెప్పుకొచ్చారు.