ఏపీలో కరోనా: ఈగవాలిన ప్రభుత్వానిదే బాధ్యత, చంద్రబాబు హైదరాబాద్లో ఉంటూ.. బొత్స విసుర్లు..
ఆంధ్రప్రదేశ్లో ప్రజలపై ఈగవాలిన బాధ్యత ప్రభుత్వానిదేనని మున్సిపల్ శాఖమంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టంచేశారు. ప్రజల ఆరోగ్యం ప్రభుత్వం రెస్పాన్సిబులిటీ అని, స్వేచ్ఛగా జీవించేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. కరోనా వైరస్ వల్ల రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలను వివరించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలను బొత్స సత్యనారాయణ తప్పుపట్టారు. ఆపత్కాలంలో ప్రజలకు అండగా ఉండాల్సిన నేతలు.. చౌకబారు ఆరోపణలు చేయడం సరికాదని సూచించారు.
ఆత్మవిమర్శ చేసుకొండి..
పేదల ప్రాణాలతో ఆడుకొవద్దని చంద్రబాబు నాయుడు సూక్తులు చెబుతున్నారని.. ఆయన ఎక్కుడున్నారని మంత్రి బొత్స ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉండకుండా.. హైదరాబాద్లో ఉంటోన్న చంద్రబాబుకు ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు ఉందా అని ప్రశ్నించారు. నీ కుమారుడు లోకేశ్ నాయుడు హైదరాబాద్లో ఉన్నారని గుర్తుచేశారు. మీ అనుచరులు, ముఖ్యనేతలు లాక్ డౌన్ వల్ల ఇంటికే పరిమితం అవుతున్నారని బొత్స సత్యనారాయణ గుర్తుచేశారు. ఏం జరుగుతుందో క్షేత్రస్థాయిలో తెలుసుకొకుండా ఎలా మాట్లాడతారు అని ప్రశ్నించారు.
5 రాష్ట్రాల్లో ఏపీ ఒకటి..
దేశంలో అత్యధికంగా కరోనా వైరస్ పరీక్షలు చేస్తున్న రాష్ట్రాల్లో ఏపీ ఒకటి అని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. తొలుత రోజుకు 50 నుంచి.. ఇప్పుడు 2 వేల మందికి పరీక్షలు చేస్తున్నామని వివరించారు. అవేమీ తెలియకుండా దిగజారి, చౌకబారుగా మాట్లాడటం సరికాదని సూచించారు. మరో టీడీపీ నేత విశాఖలో కరోనా పాజిటివ్ వచ్చినా చెప్పడం లేదు అని ఆరోపిస్తున్నారు. రాజధాని తరలించమని డిమాండ్ వస్తున్నందునే ఇలాంటి చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. పాజిటివ్ వస్తే చెప్పని పరిస్థితి ఉందా...? కరోనా వైరస్ సోకిన వారిని దాచే సిచుయేషన్ ఉందా అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.
అక్కడ ఎందుకంటే..
చంద్రబాబు నాయుడు ప్రెస్మీట్లో విశాఖకు వైద్యులను తరలిస్తున్నారని డేటా చదివి వినిపించారని గుర్తుచేశారు. అక్కడ రెండు మెడికల్ కాలేజీలు ఉన్నాయి. 10 పెద్ద ఆస్పత్రులు ఉన్నందున వైద్యులు ఉన్నారని తెలిపారు. ఏ పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు వైద్యులను ఏర్పాటు చేశామని.. దీనిపై కూడా ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు.
Recommended Video
ఇంటికే సరుకులు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో కలిసి పనిచేస్తున్నాయని బొత్స సత్యనారాయణ తెలిపారు. సామాన్యులకు ఇబ్బందులు కలుగకుండా నిత్యావసర వస్తువులు, మందులను అందజేస్తున్నామని చెప్పారు. రెడ్ జోన్లలో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. పంటకు గిట్టుబాటు ధర అందేలా చర్యలు తీసుకుంటామని, ఇందులో సందేహానికి తావులేదని బొత్స సత్యనారాయణ స్పష్టంచేశారు.