అర్హులకు ఇళ్లు నిర్మిస్తాం, జాబితాలో అనర్హులు ఉంటే చర్యలు, అధికారులకు మంత్రి బొత్స వార్నింగ్
రాష్ట్రంలో అర్హులందరికీ ఇళ్లను నిర్మిస్తామని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టంచేశారు. గూడు లేని ప్రతీ ఒక్కరికీ ఇళ్లు నిర్మించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. అయితే అనర్హులకు మాత్రం కఠినంగా వ్యవహారిస్తామని, జాబితాలో అనర్హులు ఉంటే నిష్పాక్షిపాతంగా తొలిగిస్తామని స్పష్టంచేశారు. ఆయన మంగళవారం కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల మున్సిపల్ కమిషనర్లతో ఇళ్ల నిర్మాణ అంశంపై సమీక్షించారు.
ప్రతీ మున్సిపాలిటీ పరిధిలో అర్హులైన పేదలకు ఇళ్లను నిర్మిస్తామని.. జాబితాలో వారికే మొదటి ప్రాధాన్యత అని స్పష్టంచేశారు. జాబితాలో పేదలకు ప్రయారిటీ ఇవ్వాలని, ఈ అంశాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. ఇదివరకు మంజూరు చేసిన ఉత్తర్వుల్లో అర్హత లేనివారు ఉంటే గుర్తించి.. వారిని జాబితా నుంచి తొలిగించాలని స్పష్టంచేశారు. ఈ విషయంలో అధికారులుకఠినంగా ఉండాలని తేల్చిచెప్పారు.
గ్రామ వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి సర్వే చేయాలని స్పష్టంచేశారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఇళ్ల కేటాయింపులు చేయాలని తేల్చిచెప్పారు. దీంతోపాటు వేసవి వస్తోన్నందున నీటి కొరత రాకుండా చూడాలన్నారు. నీటి ఎద్దడి రాకుండా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై దృష్టిసారించాలని అధికారులకు సూచించారు. ఇప్పటినుంచే ప్రణాళిక సిద్దం చేసుకుంటే.. సమ్మర్లో సమస్య లేకుండా ఉండొచ్చన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన 85 శాతం హామీలను 8 నెలల్లోనే జగన్ ప్రభుత్వం నెరవేర్చిందని ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ తెలిపారు.