జగన్ సర్కార్ను ఆదుకున్న మోడీ?: కాగల కార్యాన్ని కేంద్రమే తీర్చిందా?: పంచాయతీ వెనక్కి?
అమరావతి: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల రచ్చ చెలరేగిన వేళ.. ఎన్నికల కమిషన్ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం ఘర్షణ వైఖరికి దిగిన సందర్భంలో.. కాగల కార్యాన్ని కేంద్రమే తీర్చినట్టయింది. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టాల్సిన ప్రస్తుత పరిస్థితుల్లో పంచాయతీ ఎన్నికలను నిర్వహించలేమంటూ జగన్ సర్కార్ చేస్తోన్న వాదనకు మరింత బలం కలిగింది. ఈ నెల 16వ తేదీ నుంచి దశలవారీగా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టనుందనే కారణాన్ని చూపించి, ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం పుల్స్టాప్ పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
16 నుంచి వ్యాక్సినేషన్..
ప్రాణాంతక కరోనా వైరస్ను నిర్మూలించడానికి ఈ నెల 16వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి నిర్వహించబోతోన్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికోసం- పల్స్ పోలియోను కూడా కేంద్రం వాయిదా వేసింది. వ్యాక్సిన్ సరఫరా-పంపిణీ వంటి పనులను మంగళవారం చేపట్టనుంది. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా దీనికి అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాల్సి ఉంటుందంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను సైతం జారీ చేసింది. ఎలాంటి లోటుపాట్లకు అవకాశం ఇవ్వొద్దంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు.
జగన్ సర్కార్ వాదనకు మరింత బలం..
రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టాల్సి ఉన్నందున పంచాయతీ ఎన్నికలను నిర్వహించలేమంటూ ప్రభుత్వం మొదటి నుంచీ చెబుతూ వస్తోంది. ఉద్యోగ సంఘాలు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలను నిర్వహించడం కంటే వ్యాక్సినేషన్ కార్యక్రమానికే అధిక ప్రాధాన్యతను ఇవ్వాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం కూడా సూచించిన విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ జారీ చేసిన నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలు చేసిన పిటీషన్పై వాదనలను సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇదే విషయాన్ని వినిపించబోతోందని అంటున్నారు.
పంచాయతీ ఎన్నికల నిర్వహణ సాధ్యం కాకపోవచ్చంటూ..
వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి హెల్త్ వర్కర్లు, ఉపాధ్యాయులు, ఉద్యోగులను పెద్ద సంఖ్యలో మోహరింపజేయాల్సి ఉన్నందున.. అదే సమయంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైన సిబ్బంది అందుబాటులో ఉండలేకపోవచ్చనే వాదనను రాష్ట్ర ప్రభుత్వం బలంగా వినిపిస్తోంది.కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్, బర్డ్ ఫ్లూ వంటివి ప్రబలుతున్నాయని, తమ ప్రాణాలను పణంగా పెట్టలేమంటూ ఏపీ ఎన్జీవో సంఘం ఇప్పటికే స్పష్టం చేసింది. అదే సమయంలో వ్యాక్సినేషన్ తేదీని కేంద్ర ప్రకటించడంతో వారి వాదనకు మరింత బలం లభించినట్టయింది.
వచ్చేనెల 5 నుంచి..
వచ్చేనెల 5వ తేదీ నుంచి రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించడానికి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ షెడ్యూల్ను విడుదల చేసిన విషయం తెలిసిందే. 5న తొలివిడత, 9న రెండోదశ పంచాయతీ ఎన్నికలను నిర్వహించాల్సి ఉంటుంది. 13వ తేదీన మూడోదశ, 17వ తేదీన నాలుగోదశ ఎన్నికల నిర్వహణకు ఆయనకు నోటిఫికేషన్ జారీ చేశారు. కొత్త పథకాలు, ప్రస్తుత పథకాలకూ ఎన్నికల కోడ్ వర్తిస్తుందంటూ ఆయన చేసిన ప్రకటన పట్ల విమర్శలు చెలరేగుతున్నాయి. సోమవారం అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించాల్సి ఉండగా.. దాన్ని అడ్డుకోవడానికే హడావుడిగా షెడ్యూల్ ప్రకటించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.