ఒక్క స్పీచుతో హీరో అయిన గల్లా జయదేవ్: గుంటూరు దమ్ము చూపించాడంటున్నారు..
Recommended Video
గుంటూరు: నిన్న మొన్నటిదాకా టీడీపీలో ఓ సాదాసీదా ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ ఇప్పుడు ఒక్కసారిగా హీరో అయిపోయారు. విభజన హామిల వైఫల్యంపై కేంద్రాన్ని నిలదీస్తూ పార్లమెంటులో ఆయన ఇచ్చిన స్పీచుకు ఏపీ యువత ఫిదా అయిపోయింది. సోషల్ మీడియాలో ఆయన ప్రసంగం వైరల్ గా మారింది. ప్రధానమంత్రి, ఆర్థికమంత్రులను సూటిగా ప్రశ్నిస్తూ చేసిన ప్రసంగం ఆయనకు ఎక్కడలేని క్రేజ్ తీసుకొచ్చింది.
గల్లాకు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు..:
గుంటూరు మిర్చి ఘాటు ఎలా ఉంటుందో పార్లమెంటులో రుచిచూపించినందుకు ఎంపీ గల్లా జయదేవ్ కు ఘనస్వాగత ఏర్పాట్లు జరుగుతున్నాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మార్చికి వాయిదా పడటంతో ఆయన నేడు గుంటూరుకు రానున్నారు. దీంతో తమ ఎంపీ తెగువను అభినందిస్తూ ఆయనపై అభిమానం చాటుకోవడానికి గుంటూరు టీడీపీ శ్రేణులు సిద్దమయ్యాయి.
బీజేపీని కడిగిపారేసిన గల్లా..:
2014ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన జయదేవ్.. ఈ స్థాయిలో మునుపెన్నడూ మాట్లాడలేదు. తాజా స్పీచుతో పార్లమెంటులో గుంటూరు ప్రతాపమేంటో చూపించారని అక్కడివాళ్లు మెచ్చుకుంటున్నారు.
పార్లమెంటులో దాదాపు పావుగంట పాటు ఇంగ్లీషులోనే మాట్లాడిన జయదేవ్.. మిస్టర్ ప్రైమ్ మినిష్టర్, మిస్టర్ ఫైనాన్స్ మినిష్టర్ అంటూ గద్దింపు స్వరంతో వారిని నిలదీశారు. ఏపీ ప్రజలు ఫూల్స్ కాదని.. ఈ విషయంలో సంజాయిషీ ఇవ్వడానికి మీకు ఇదే లాస్ట్ ఛాన్స్ అంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఆకట్టుకున్న ప్రసంగం..:
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికి 29 సార్లు ఎంపీలతో కలిసి ప్రధానికి సమస్యలను వివరించారని తన ప్రసంగంలో జయదేవ్ ప్రస్తావించారు.
అయినా సరే, రాజధానికి నిధులు ఇవ్వలేదని, విశాఖకు రైల్వే జోన్ మాటే లేకుండా పోయిందని మండిపడ్డారు. ఇలాంటి సందర్భంలో బీజేపీతో మేము పొత్తు ఎందుకు కొనసాగించాలి? అని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వానికి ఇచ్చిన నిధులు బాహుబలి కలెక్షన్ల కంటే తక్కువగా ఉన్నాయని ఎద్దేవా చేశారు.
ఏపీ ప్రజల మనసు గెలుచుకున్నారని..:
వ్యక్తిగత పొలిటికల్ మైలేజ్ కోసం చట్టసభల్లో నానా స్టంట్స్ చేసే నేతల కన్నా.. హుందాగా ప్రశ్నిస్తూ జయదేవ్ చేసిన ప్రసంగం ఏపీ ప్రజల మనసు గెలిచిందని అంటున్నారు. ఎంపీగా ఎన్నికై గుంటూరు ప్రజల మనసు గెలిచిన జయదేవ్.. ఈ స్పీచుతో ఐదున్నర కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసు గెలుచుకున్నారని చెబుతున్నారు.