హరీష్ కు ఘన స్వాగతం: ఏపిలో ఏంటీ ఆదరణ : మారుతున్న సమీకరణాలు
టిఆర్యస్ ముఖ్యనేత హరీష్ రావుకు ఏపిలో ఘన స్వాగతం లభించింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారిని దర్శించుకొనేందుకు హరీష్ తిరుపతి వచ్చారు. రేణిగుంట విమానాశ్రయం లో హరీష్ కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. తెలంగాణ ఎన్నికలలో గెలిచిన తరువాత తొలి సారి ఏపికి రావటంతో హరీష్ కు అభినందనలు తెలిపారు. హరీష్ కు ఈ స్థాయిలో స్వాగతం లభించటం తో..ఇప్పుడు ఏపి లో కొత్త సమీకరణాలకు తెర లేస్తోంది..
ఏపిలో సమీకరణాలు మారుతున్నాయి. తెలంగాణ ఎన్నికల తరువాత ఏపి రాజకీయాల్లో జోక్యం చేసుకుంటామంటూ ముఖ్యమంత్రి కెసిఆర్..కెటిఆర్ పదే పదే చెబుతున్నారు. వీరికి తోడుగా ఎంఐఎం అధినేత ఓవైసీ సైతం చంద్రబాబు కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని స్పష్టం చేసారు. ఈ పరిస్థితుల్లో వీరు కాకుండా టిఆర్యస్ పార్టీకే చెందిన మరో ము ఖ్యుడు హరీష్ తిరుమలకు వచ్చారు. తెలంగాణ ప్రాంతం కాకపోయినా..ఇక్కడ పార్టీ లేకపోయినా..హరీష్ కు ఊహించ ని విధంగా స్వాగతం లభించింది. గతంలో కెసిఆర్ అమరావతి శంఖుస్థాపనకు వచ్చిన సమయంలో..తిరుపతికి వచ్చి న సమయంలోనూ పెద్ద ఎత్తున స్వాగతం లభించింది. అయితే, ఏపిలో మారుతున్న రాజకీయ సమీకరణాల్లో ఏపి లో నూ తమ కు ఉన్న ఫాలోయింగ్ చూపించాలని టిఆర్యస్ నేతలు భావిస్తున్నారు.
టిఆర్యస్ ఏపిలో జనగ్ లేదా పవన్ కు మద్దతు ఇవ్వచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే, కెసిఆర్ నేరుగా జగన్ లేదా పవన్ లకు మద్దతు ఇస్తే ఖచ్చితంగా అది ఏపి రాజకీయాల్లో కొత్త టర్న్ తీసుకుంటుంది. ఏపికి వ్యతిరేకంగా కెసిఆర్ పని చేసారని..అటువంటి వ్యక్తితో పొత్తు ఏంటని టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో..తొలుత కెసిఆర్ తో పొత్తు కోసం వెంపర్లాడింది చంద్రబాబే అంటూ జగన్ విమర్శిస్తున్నారు. అసలు..టిఆర్యస్ నేతలు ఏ విధంగా ఏపి రాజకీయాల్లో వ్యవహరిస్తారో కానీ, ఇప్పటికే ఆ ప్రభావం మాత్రం ఏపి రాజకీయాల్లో మొదలైనట్లుగా కనిపిస్తోంది.