మనవడి కోసం అమ్మమ్మ సూసైడ్.. బాధతట్టుకోలేక రైలు పట్టాలపై..
Recommended Video
మానవ సంబంధాలు, అనుబంధాలు మృగ మై పోతున్న నేటి రోజుల్లో ఓ అమ్మ మనవడి కోసం తీసుకున్న నిర్ణయం అందరినీ షాక్ కు గురి చేసింది. ఊహించని విధంగా జరిగిన ప్రమాదంలో మనవడు ప్రాణాలు కోల్పోగా ఆ మనవణ్ణి తలచుకుని పదేపదే దుఃఖించిన అమ్మమ్మ అతను లేకుండా జీవించ లేక పోయింది. మరణించిన చోటికి వెళ్లి ప్రాణాలు విడిచింది.
మనవడి కోసం అమ్మమ్మ ఆత్మహత్య
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో మనవడి కోసం అమ్మమ్మ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. ఈ ఘటన చూసిన వారందరి మనసు చలించిపోయింది. మనవడు లేక బ్రతకలేక పోయిన ఓ అమ్మమ్మ తీసుకున్న నిర్ణయానికి ఈ సంఘటన చూసిన వారంతా కంటతడి పెట్టారు. ఏలూరు కొత్తపేట కు చెందిన 65 ఏళ్ల గొర్రెల ద్రాక్షవేణికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. కుమారులు వివాహం చేసుకొని వేరే కాపురాలు పెట్టి జీవనం సాగిస్తున్నారు. ఇక ద్రాక్షవేణి కుమార్తె తులసమ్మ భర్త విడిచిపెట్టడంతో తల్లి వద్దే ఉండి జీవనం సాగిస్తుంది.
కూతురు కుటుంబాన్ని పోషించిన అమ్మమ్మ ద్రాక్షవేణి
తులసమ్మకు ముగ్గురు కుమారులు, ఈ ముగ్గురు కుమారులను ద్రాక్షవేణి పెంచి పెద్ద చేసింది. అందరిని ప్రయోజకుల్ని చేసిన అమ్మమ్మ పెళ్ళిళ్ళు కూడా చేసింది. ఇక వీరిలో మూడో మనవడైన 25ఏళ్ల మర్రి సుధాకర్ అంటే అమ్మమ్మ కు ఎనలేని ప్రేమ. దీంతో అతను పెళ్లయిన తర్వాత కూడా అమ్మ, అమ్మమ్మల వద్దే ఉంటూ పెయింటింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
ప్రశాంతంగా సాగిపోతున్న వీరి జీవితంలో ఊహించని పరిణామం జరిగింది. ఆ పరిణామం అమ్మమ్మ మరణానికి కారణం అయ్యింది.
రైలు పట్టాలు దాటుతుండగా మనవడు మృతి
ఈ సంవత్సరం జూలై 21వ తేదీన పనికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో ఏలూరులోని గిలకలగేటు వద్ద పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని సుధాకర్ మృతి చెందారు. ఇక అప్పటినుండి మనవడి కోసం తీవ్ర మనోవేదనకు గురైన ద్రాక్షవేణి మనవడిని మరచిపోలేకపోతుంది. అతని జ్ఞాపకాలతో రోజూ కుమిలిపోతూ ఇంత కాలం జీవించిన ఆమె చివరికి మనవడు ప్రమాదానికి గురైన రైలు పట్టాల వద్దకు వెళ్ళి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది.
మనవడు మరణించిన రైలుపట్టాలపైనే అమ్మమ్మ ఆత్మహత్య
మనవడి మీద ప్రేమతో, మనవడి మరణాన్ని జీర్ణించుకోలేక అమ్మమ్మ ద్రాక్షవేణి ప్రాణం తీసుకుంది. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొన్న అమ్మమ్మ , మనవడి మరణాన్ని తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడటంతో స్థానికంగా విషాదం నెలకొంది. మానవ సంబంధాలు, అనుబంధాలకు అర్థం మర్చిపోతున్న నేటి రోజుల్లో ఓ మనవడి కోసం అమ్మమ్మ తీసుకున్న తీవ్ర నిర్ణయం వారి మధ్య ఉన్న ప్రేమానుబంధాన్ని తెలియజేస్తుంది.