టెన్త్ క్లాస్:కార్పొరేట్ స్టూడెంట్స్ తో పోటీకి..కార్పొరేషన్ విద్యార్థుల సన్నద్దం
విజయవాడ: కార్పొరేట్ స్కూళ్లలో చదివే స్టూడెంట్స్ తో తమ మున్సిపల్ కార్పోరేషన్ బడుల్లో చదివే విద్యార్థులు పోటీపడేందుకు గాను విజయవాడ నగరపాలక సంస్థ చేస్తున్న కృషి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అంతేకాదు వారిపై అన్నివైపుల నుంచి ప్రశంసల వర్షం కురిపిస్తోంది.
మరో పదిరోజుల్లో ఎపిలో పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా తమ మున్సిపల్ పాఠశాలల విద్యార్ధులను తీర్చిదిద్దేందుకు విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు, ప్రజాప్రతినిధులు నడుం బిగించారు. ఇందుకు గాను వారు చేస్తున్న ప్రత్యేక కృషి, అందుకోసం రూపొందించిన వినూత్న ప్రణాళిక, ఆ ప్రణాళికను చిత్తశుద్దితో అమలు చేస్తున్నతీరు అందరి అభినందనలు అందుకుంటోంది...వివరాల్లోకి వెళితే...
వీళ్ల కోసం నగరంలోని సివిఆర్ జిఎంసి స్కూల్ భవనం పైన ప్రత్యేకంగా విద్యుత్ దీపాలను ఏర్పాటుచేసి వాటి వెలుగులో ఏ అవాంతరం లేకుండా చదువుకునే అవకాశం కల్పించారు. అంతేకాదు విద్యార్ధులు ఇక్కడే నిరాటంకంగా చదువుకునేందుకు అన్ని వసతులూ కల్పించారు. అలాగే వీరి కోసం 10 మంది నిపుణులైన ఉపాధ్యాయులను ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశారు. వివిధ సబ్జెక్టుల్లో నిష్ణాతులైన విద్యార్థులకు ఆయా సబ్జెక్టులకు సంబంధించి ఏవైనా సందేహాలు వస్తే అక్కడికక్కడే తీర్చేస్తారు. ఇలా ఇక్కడ సుమారు 100 మంది కార్పొరేషన్ విద్యార్థులు కార్పొరేట్ స్టూడెండ్స్ తో పోటీకీ, 10కి 10 జిపిఎ సాధించేందుకు సమాయత్తం అవుతున్నారు.
కేవలం ప్రతిభ కలిగిన విద్యార్థులను ప్రోత్సహించడమే కాకుండా చదువులో కొంత వెనుకబడి ఉన్న విద్యార్థులపై సైతం విజయవాడ నగర పాలక సంస్థ దృష్టి పెట్టింది. విజయవాడ నగరంలోనే మరో రెండు ప్రాంతాల్లో ఈ విధమైన విద్యార్థుల కోసం ఇలాంటి సదుపాయాలే కల్పించి వారికి కూడా ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తోంది. తమ పాఠశాలల విద్యార్థుల పట్ల విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ చూపుతున్నశ్రద్ధపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.