విమానయాన శాఖ అనుమతులు: పుష్కరాలకు రాంచరణ్ విమానాలు
న్యూఢిల్లీ/హైదరాబాద్: ప్రముఖ టాలీవుడ్ నటుడు, కాంగ్రెస్ నేత చిరంజీవి కుమారుడు రాంచరణ్ తేజ్ యజమానిగా ఉన్న ట్రూజెట్ ఎయిర్వేస్(టర్బో మెగా ఎయిర్వేస్)కు కేంద్ర విమానయాన శాఖ అన్ని అనుమతులు ఇచ్చినట్లు ఆ శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు ఢిల్లీలో తెలిపారు. రాంచరణ్ సంస్థ ఇక తమ విమానాలను దేశ వ్యాప్తంగా నడుపుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెప్పారు.
నిరుడు జులై లో టర్బో మెగా ఎయిర్వేస్ను ప్రాంతీయ సంస్థగా గుర్తించారు. ఇప్పుడు జాతీయ సంస్థగా గుర్తింపు ఇస్తూ విమానయాన శాఖ అనుమతులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రికి రాంచరణ్ విమాన సర్వీసులు నడవనున్నాయి.
కాగా, రామ్ చరణ్ భాగస్వామిగా ఉన్న టర్బో మేఘా ఎయిర్వేస్కు వంకాయలపాటి ఉమేశ్ మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. తొలిదశలో 8 పట్టణాలకు పరిమితమైనప్పటికీ క్రమంగా తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా సుమారు 18 ద్వితీయ శ్రేణి నగరాలకు సర్వీసులను విస్తరించే యోచనలో ట్రూజెట్ ఉంది.
హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, మధురై, బెల్గాం, హుబ్లీ, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, కడప, కోయంబత్తూర్, ట్యుటికోరిన్, సేలం వంటి నగరాలకు విమానయాన సేవలు అందించాలని ట్రూజెట్ నిర్ణయించింది.