పెళ్లికి ముందే పరారీ: మరో యవతిని పెళ్లి చేసుకుని ప్రత్యక్షమయ్యాడు
హైదరాబాద్: పెళ్లి చేసుకుంటానని చెప్పి కట్నకానుకులూ తీసుకుని, ముందు రోజు రాత్రి కనిపించకుండా పోయి... మరో యువతిని పెళ్లి చేసుకొని ప్రత్యక్షమయ్యాడు. ఇదేంటని ప్రశ్నిస్తే, బెదిరింపులకు పాల్పడ్డ సంఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. బాధితురాలు, ఇన్స్పెక్టర్ బాలాజీ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
నగరంలోని పురాణాపూల్ ప్రాంతానికి చెందిన వధువుతో నల్లకుంట ప్రాంతానికి చెందిన సూర్యకాంత్ పంచాల్ కుమారుడు శ్రీనివాస్ పంచాల్తో వివాహం చేయాలని నిర్ణయించారు. నిశ్చితార్ధ సమయంలోనే కట్నకానుకలు మాట్లాడుకున్నారు.
నిశ్చితార్థం జరిగిన రెండు రోజుల తర్వాత ఎవరో తెలియని వ్యక్తులు వధువుకు ఫోన్ చేసి మా శ్రీనివాస్ను చేసుకుంటే మీ కుటుంబం అంతా అల్లకల్లొలం అవుతుందని బెదిరించారు. ఈ బెదిరింపు ఫోన్ కాల్స్పై వధువు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీంతో పెళ్లి కొడుకు తాను పెళ్లికి సిద్ధంగానే ఉన్నట్లు అటు పోలీసులు, ఇటు వధువుని నమ్మించాడు. పురాణపూల్లోని వధువు ఇంటి నుంచి పెళ్లి కూతురును ముస్తాబు చేసుకొని ఫంక్షన్ హాల్కు చేరుకున్నారు. అయితే పెళ్లికి ముందు రోజు రాత్రే పెళ్లి కొడుకు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా కనపించకుండా పోయాడు.
ఈ విషయాన్ని వరుడి తల్లిదండ్రులు ఎవరికీ తెలియకుండా వధువు వచ్చే వరకు ఎదురు చూశారు. ముహూర్త సమయానికి వరుడు కన్పించకపోయేసరికి పెళ్లి కూతురు బంధువులు శ్రీనివాస్ ఎక్కడ అంటూ నిలదీశారు. ఇంతలో శ్రీనివాస్ మరో అమ్మాయిని పెళ్లి చేసుకొని నల్లకుంట పోలీస్ స్టేషన్లో ప్రత్యేక్షమయ్యాడు.
ఇదేంటని వధువు తరుపు బంధువులు ప్రశ్నిస్తే, ఏం చేసుకుంటారో చేసుకోండంటూ బెదిరించాడు. దీంతో చేసేదేమిలేక వధువు తరుపు బంధువులు శనివారం హుసేనీ ఆలం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.