కొవ్వూరు టిడిపిలో 'చిచ్చు': ఆ నేతల మధ్య విబేధాలు, మంత్రి జవహర్కు తలనొప్పులు
అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లాలోని టిడిపి నేతల మధ్య అధిపత్య పోరు సాగుతోంది. ఈ జిల్లాలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.జిల్లాలోని కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రి అనుచరుడికి, మరో మండలస్థాయి నేతకు మధ్య ఆధిపత్య పోరు తీవ్రస్థాయికి చేరుకొంది. అయితే ఈ ఇద్దరి నేతల మధ్య రాజీ కుదర్చాల్సిన నేతల మాత్రం చోద్యం చూస్తున్నారనే విమర్శలు కూడ లేకపోలేదు.
ఏపీ రాష్ట్రంలో అధికార పార్టీలో గ్రూపుల వివాదాలు తీవ్రమౌతున్నాయి. అయితే అధికార పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు విపక్ష పార్టీలకు కలిసివచ్చే అవకాశాలు కూడ లేకపోలేదు.
అయితే ఈ విషయమై పార్టీ నాయకత్వం చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.ఒకే పార్టీలోని ఇద్దరు నేతల మధ్య విబేధాలను తగ్గించేందుకు చర్యలను తీసుకోకపోతే ఇబ్బందులు తప్పవనే రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
కొవ్వూరు నియోజకవర్గంలో టిడిపి నేతల మధ్య ఆధిపత్య పోరు
పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గంలో టిడిపి నేతల మధ్య ఆధిపత్యపోరు కొనసాగుతోంది. కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రి జవహర్ అనుచరుడికి చాగల్లు జడ్పీటిసి సభ్యుడు విక్రమాదిత్య మధ్య ఆదిపత్య పోరు సాగుతోంది. శిలాఫలకాలపై పేర్లు రాయకపోవడమే దీనికి ప్రధాన కారణమనే ప్రచారం కూడ సాగుతోంది.
ఆ నేతల మధ్య చిచ్చుకు కారణమే
పశ్చిమగోదావరి జిల్లా చాగల్లు జడ్పీటీసీ సభ్యుడు అల్లూరి విక్రమాదిత్యకు మంత్రి జవహర్ అనుచరుడికి మధ్య వివాదం చోటుచేసుకొంది. ఈ వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. విక్రమాదిత్య స్వంత గ్రామంలోనే ఈ వివాదానికి వేదికగా మారింది. అన్నదేవరపేటలో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాల్లో మంత్రి జవహర్ శ్రీకారం చుట్టారు. అయితే చాగల్లు జడ్పీటీసీ సభ్యుడు విక్రమాదిత్య స్వంత ఊరు అన్నదేవరపేట. అయితే ఆ గ్రామంలో నిర్వహించిన అభివృద్ది కార్యక్రమాల్లో జడ్పీటీసీ సభ్యుడు విక్రమాదిత్య పేరు లేకుండా మంత్రి అనుచరుడి పేరు శిలాపలకంపై వేయించారు. దీంతో వివాదం రాజుకొంది. ఈ విషయమై విక్రమాదిత్య వర్గీయులు మంత్రి అనుచరులను నిలదీశారు.
మంత్రి ఎదుటే రెండు వర్గాల బాహబాహీ
ఇంటింటికి టిడిపి కార్యక్రమంలో మంత్రి జవహర్ అన్నదేవరపేటకు వచ్చారు. అయితే చాగల్లు జడ్పీటీసీ సభ్యుడు విక్రమాదిత్య వర్గీయులు ఈ విషయమై మంత్రిని నిలదీశారు. దీంతో మంత్రి అనుచరులకు విక్రమాదిత్య వర్గీయులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకొంది. అంతేకాదు ఈ గొడవ తీవ్రమైంది. అంతేకాదు రెండు వర్గాలు కూడ బాహ బాహీకి దిగారు. అయితే మంత్రి పోలీసులకు చెప్పి రెండు వర్గాలను శాంతింపజేశారు.
గొడవలను సర్దుబాటు చేయాలి
కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని టిడిపిలో ఈ ఇద్దరు నేతల మధ్య చోటుచేసుకొన్న వివాదాన్ని పరిష్కరించకపోతే పార్టీ నష్టపోయే ప్రమాదం ఉందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే మంత్రి మాత్రం పార్టీలో ఎలాంటి విబేధాలు లేవనే చెబుతున్నారు. అయితే నేతల మధ్య విబేధాలు కొనసాగితే ఎన్నికల సమయంలో ఈ వివాదాలు పార్టీకి నష్టం కల్గించే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలు కూడ కొందరు సీనియర్లు వ్యక్తం చేస్తున్నారు.